ఆ చాంపియన్‌షిప్ కోసం సరికొత్త ఫార్ములా

by  |
ఆ చాంపియన్‌షిప్ కోసం సరికొత్త ఫార్ములా
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ విషయంలో సరికొత్త ఫార్ములాను అవలంభించనున్నట్లు తెలుస్తున్నది. కరోనా మహమ్మారి కారణంగా టెస్టు చాంపియన్‌షిప్‌కు సంబంధించిన పలు టెస్టులు వాయిదా పడటంతో పాయింట్లు కూడా తగ్గిపోయాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జులైలో టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఐసీసీ దీనిపై ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని భావిస్తున్నది.

రద్దైన మ్యాచ్‌లకు సంబంధించి ఇరు జట్లకు సమానమైన పాయింట్లు పంచాలనే ప్రతిపాదన ఇంతకు ముందు వచ్చింది. ఈ ప్రతిపాదనను మెజార్టీ టెస్టు దేశాలు అంగీకరించాయి. దీంతో వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా జరిగే టెస్టు మ్యాచ్‌లకు తప్ప.. వాయిదా/రద్దైన అన్ని మ్యాచ్‌లకు సమాన పాయింట్లు పంచనున్నారు. ప్రస్తుతం విజయాల శాతం ప్రకారం ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. పాయింట్లకు బదులు విజయాల శాతం ప్రకారం జట్లను ఎంపిక చేసి.. తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లను టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్ ఆడించాలని ఐసీసీ భావిస్తున్నది. దీనికి సంబంధిచిన నిర్ణయం వచ్చే వారంలో వెలువడే అవకాశం ఉన్నది.

Next Story

Most Viewed