వరల్డ్ కప్ క్వాలిఫయర్ వేదికలు మార్చిన ఐసీసీ

by  |
వరల్డ్ కప్ క్వాలిఫయర్ వేదికలు మార్చిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రెండు వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ వేదికలను మారుస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నది. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ యూరోప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆగస్టు 26 నుంచి 30 వరకు స్కాట్లాండ్‌లో నిర్వహించాల్సి ఉన్నది. అయితే స్కాట్లాండ్‌లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తుండటంతో వేదికను స్పెయిన్‌కు మార్చారు. అయితే టోర్నీ తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఐసీసీ తెలియజేసింది. ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, టర్కీ దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఐసీసీ ఉమెన్స్ ఈవెంట్‌లో ఫ్రాన్స్, టర్కీ పాల్గొనడం ఇదే తొలిసారి. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. ఇక 2022 పురుషుల అండర్ 19 వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి 25 వరకు నెదర్లాండ్స్‌లో జరగాల్సి ఉండగా.. వీటిని కూడా స్పెయిన్‌లోని లా మంగాకు తరలించారు. ఐర్లాండ్, జెర్సీ, నెదర్లాండ్, స్కాట్లాండ్ జట్లు వరల్డ్ కప్ బెర్త్ కోసం పోటీ పడనున్నాయి. ‘క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొంటున్న జట్లను సంప్రదించిన తర్వాతే వేదికను మార్చే నిర్ణయం తీసుకున్నాము. కరోనా వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ముందస్తుగా వేదికను మార్చాము’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.



Next Story

Most Viewed