కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళా క్రికెట్

by  |
కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళా క్రికెట్
X

దిశ, స్పోర్ట్స్ : బర్మింగ్‌హామ్‌లో 2022లో జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల టీ20 క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది. గత కొన్నాళ్లుగా కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (CGF), ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో మహిళా క్రికెట్‌కు మార్గం సుగమమం అయ్యింది. ఈ మేరకు కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత నియమాలను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. మహిళా క్రికెట్‌కు మరింత ఆదరణ తీసుకొని రావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల జట్లు 1998 కౌలాలంపూర్ గేమ్స్‌లో ప్రవేశపెట్టారు. కానీ, ఆ తర్వాత ఐసీసీ ఎఫ్‌టీపీకి ఆటంకాలు ఏర్పడడంతో పురుషుల క్రికెట్‌ను ఉపసంహరించుకున్నారు.

ఇలా అర్హత..

2022 కామన్వెల్త్ గేమ్స్‌‌లో 8 జట్లతో టీ20 క్రికెట్‌ను నిర్వహించనున్నారు. ఈ గేమ్స్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుండడంతో ఆ దేశ మహిళా జట్టు నేరుగా అర్హత సాధించనున్నది. 1 ఏప్రిల్ 2021 నాటికి ఐసీసీ టీ20 రేటింగ్స్‌లో టాప్ 6లో ఉన్న జట్లు కూడా అర్హత సాధిస్తాయి. ఇక మిగిలిన ఒక స్థానం కోసం కామన్వెల్త్ గేమ్స్ క్వాలిఫయర్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. 2022 జనవరి 31లోగా ఈ క్వాలిఫయర్స్ పూర్తవుతాయి. అయితే కొన్ని దేశాల సమూహమైన వెస్టిండీస్ జట్టు క్వాలిఫయర్‌లో గెలిచినా లేదా ర్యాంకింగ్ ద్వారా అర్హత సాధించినా.. ఎవరి తరపున ఆడాలనేది ఐసీసీ నిర్ణయించనున్నది. 2022 జులై 28 నుంచి అగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్నాయి.

Next Story