బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐసీసీ ఓకే.. ఇండియాలోనే మెగా టోర్నీ?

by  |
బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐసీసీ ఓకే.. ఇండియాలోనే మెగా టోర్నీ?
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ బలమేంటో మరోసారి రుజువయ్యింది. ఐసీసీ సమావేశంలో బీసీసీఐ కోరినట్లుగానే టీ20 వరల్డ్ కప్‌పై నిర్ణయం తీసుకునేందకు గడువును ఇచ్చింది. జూన్ 28 వరకు వేచి చూస్తామని.. ఆ తర్వాత అక్టోబర్ 18న ప్రారంభం కావల్సిన టీ20 వరల్డ్ కప్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ తేల్చి చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొన్నది. మంగళవారం దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి బీసీసీఐ తరపున రాజీవ్ శుక్లా పాల్గొనగా.. అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. వీరి అభ్యర్థన మేరకు ఐసీసీ నాలుగు వారాల గడువు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇండియాలో కరోనా కేసులు పెరిగి పోతుండటంతో గత నెల 4న ఐపీఎల్‌ 2021ని బీసీసీఐ వాయిదా వేసింది. అంతే కాకుండా సెప్టెంబర్ 18 నుంచి యూఏఈ వేదికగా మిగిలిన 31 మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ కూడా వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే మే 29న జరిగిన బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశంలో టీ20 వరల్డ్ కప్ ఇండియా వేదికగానే నిర్వహించాలని.. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు గడువు కోరాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇండియా కాకపోతే ఎక్కడ?

ఇండియాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గకుండా.. మ్యాచ్‌ల నిర్వహణకు కనుక ఆటంకం ఏర్పడితే వేదికను ఎక్కడకు మార్చాలనే దానిపై కూడా చర్చ జరిగింది. గతంలోనే ఐసీసీ చెప్పినట్లు యూఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. ఇండియాలో 16 జట్లకు 9 వేర్వేరు నగరాల్లో బయోబబుల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో పాకిస్తాన్ జట్టుకు సంబంధించి వీసా, సెక్యూరిటీ అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి ఎలాంటి ఆటంకాలు లేకుండా టోర్నీ నిర్వహిస్తామని జూన్ 28లోపు బీసీసీఐ లిఖిత పూర్వకంగా ఐసీసీకి హామీ ఇవ్వాల్సి ఉంటంది. అదే కనుక జరగకపోతే టీ20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 18 నుంచే నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 10న ఐపీఎల్ ముగిసిన తర్వాత ఈసీబీ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నది. అయితే బీసీసీఐ-ఈసీబీకి కలిపి ఆతిథ్య హక్కులు ఇస్తారా? లేదంటే కేవలం ఈసీబీ మాత్రమే నిర్వహిస్తుందా అనే దానిపై స్పష్టత రావల్సి ఉన్నది.

ఇండియాకే ప్రాధాన్యత..

టీ20 వరల్డ్ కప్ ఇండియాలో నిర్వహించడానికే బీసీసీఐ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాజీవ్ శుక్ల స్పష్టం చేశారు. ఐపీఎల్ 2021ని విజయవంతంగా నిర్వహిస్తే ఇండియాలోనే టీ20 నిర్వహించడానికి అడ్డకులు తొలగిపోతాయిని బీసీసీఐ భావించింది. కానీ కరోనా కారణంగా ప్రణాళిక మొత్తం మారిపోయింది. కాగా, ఒక నెల రోజుల్లో దేశంలో కరోనా తీవ్రతతో పాటు పలు రాష్ట్రాల్లో ఉండే లాక్‌డౌన్ కూడా ఎత్తేసే అవకాశం ఉంటుందని బీసీసీఐ భావిస్తున్నది. ఇప్పటికే వ్యాక్సినేషన్ కూడా పూర్తి స్థాయిలో జరుగుతుండటంతో పరిస్థితులు నాలుగు వారాల్లో తప్పక మెరుగుపడతాయిన బీసీసీఐ ధీమాగా ఉన్నది. అందుకే నాలుగు వారాల గడువుకు ఓకే చెప్పినట్లు తెలుస్తున్నది. ఏదేమైనా ఒక మెగా టోర్నీపై నిర్ణయం మాత్రం నెల రోజుల పాటు వాయిదా పడింది.


Next Story

Most Viewed