చక్రవడ్డీ మాఫీతో బ్యాంకులపై పడ్డ భారాన్ని తగ్గించాలని కోరిన ఐబీఏ

by  |
చక్రవడ్డీ మాఫీతో బ్యాంకులపై పడ్డ భారాన్ని తగ్గించాలని కోరిన ఐబీఏ
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది విధించిన మారటోరియంపై వసూలు చేసిన చక్రవడ్డీ మాఫీకి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుతో బ్యాంకులపై పడ్డ భారాన్ని తగ్గించాలని బ్యాంకుల సంఘం(ఐబీఏ) ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. 2020లో మార్చి నుంచి ఆగష్టు మధ్య విధించిన మారటోరియం సమయంలో రూ. 2 కోట్లకు పైన ఉన్న రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేయాలని సుప్రీంకోర్టు గతేడాది నవంబర్‌లో తీర్పు వెల్లడించింది. తాత్కాలిక మారటోరియం పథకం ద్వారా చక్రవడ్డీ మాఫీ చేయడం ద్వారా ప్రభుత్వానికి రూ. 5,500 కోట్ల భారం పడుతుందని ఒక అంచనా.

ఈ పథకం మారటోరియం కాలంలో రుణ గ్రహీతలందరికీ వర్తిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుతో పలు బ్యాంకులు దశల వారీగా దీన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మాఫీని అమలు చేయడం ద్వారా తమ బ్యాంకుపై రూ. 30 కోట్ల వరకు భారం పడుతుందని పంజాబ్ అండ్ సింఘ్ బ్యాంక్ ఎండీ ఎస్ కృష్ణన్ చెప్పారు. అయితే, మాఫీ మొత్తాన్ని తిరిగి చెల్లించే అంశంలో ఉన్న సమస్యను బ్యాంకుల తరపున ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తుందని ఆయన తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి స్పందన రాలేదని, సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు కృష్ణన్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed