వలస కూలీల కోసం భిక్షమెత్తుతా : ప్రకాశ్ రాజ్

by  |
వలస కూలీల కోసం భిక్షమెత్తుతా : ప్రకాశ్ రాజ్
X

దిశ, వెబ్ డెస్క్ :
విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాశ్ రాజ్. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, అనాథలు, వలస కూలీలకు తన ‘ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్’ ద్వారా సాయం చేస్తున్నారు. ప్రతిరోజు 500 మందికి పైగా వలస కార్మికులకు నిత్యావసరాలు, కూరగాయాలతో పాటు ఆహారం పంపిణీ చేస్తూ తనవంతు తోడ్పాటును అందిస్తున్నారు. అంతేకాకుండా వలస కార్మికులకు తన ఫాంహౌస్‌లో ఆశ్రయమిచ్చి, వారిని తమ సొంత ప్రాంతాలకు తరలించడంలోనూ శ్రద్ధ చూపించారు. కాగా కొద్ది రోజుల కిందట ‘నా దగ్గరున్న డబ్బులు అయిపోతున్నాయి. అయినప్పటికీ సాయం చేయడానికి వెనుకడుగు వేయను. కావాలంటే అప్పు చేస్తాను. నేను మళ్ళీ సంపాదించుకోగలను’ అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.

లక్షలాది మంది వలస కార్మికులు, వందల మైళ్ల దూరాన్ని లెక్కచేయకుండా నడుచుకుంటూ పోతున్నారు. ఆ నడక దారిలో వారు అనుభవిస్తున్న నరకయాతనను చూసి చలించిన ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశారు. ‘వలస కార్మికులు రోడ్లపై ఉన్నారు. వారిని ఆదుకునేందుకు నేను అప్పు తీసుకుంటా లేదా భిక్షాటన చేస్తాను. తిరిగి వారు నాకేమీ ఇవ్వరని తెలుసు. కానీ ఓ వ్యక్తి తమ ఇంటికి చేరుకోవడానికి ఆశను కల్పించాడు. మాకు శక్తిని ఇచ్చాడని అనుకుంటే చాలు’ అని పేర్కొన్నారు.

Next Story