వీధి కుక్కల్లో కరోనా లక్షణాలు..

by  |
వీధి కుక్కల్లో కరోనా లక్షణాలు..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి ఒక్క మనుషులకే సోకుతుందని, జంతువులపై ప్రభావం ఉండదని అంతా భావించారు. అయితే, ఇటీవల తెలంగాణ పాటు ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలు కరోనా జంతువులపై కూడా ప్రభావం చూపుతుందనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. కొవిడ్ లక్షణాలు జంతువులలో కన్పించడం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. సుమారు నెల రోజుల కిందట హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్క్‌లోని ఎనిమిది సింహాలలో కరోనా లక్షణాలు కన్పించడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. దీంతో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) అధికారులు ఈ సింహాలకు నిర్వహించిన ఆర్‌టీ పీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్‌ తేలడంతో జూపార్క్‌కు వచ్చే సందర్శకులకు అనుమతి నిరాకరించారు. తాజాగా నగరంలోని వీధి కుక్కలలో కోవిడ్ లక్షణాలు కన్పించడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

చెన్నైలో కొవిడ్ బారిన పడి సింహం మృతి..

కరోనా వైరస్‌ బారిన పడి చెన్నైలో ఓ తొమ్మిదేళ్ల సివంగి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఐదు రోజుల క్రితం చెన్నైలోని అరిగ్నర్‌ అన్నా జూలాజికల్‌ పార్కులో ఈ ఘటన వెలుగు చూసింది. జూ లోని నీలా అనే సివంగిలో కొవిడ్ లక్షణాలు కనబడటంతో అధికారులు దానికి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. మొదట లక్షణాలు లేకపోయినప్పటికీ ఆ తర్వాత సింహం ముక్కులోంచి స్రావాలు రావటంతో చికిత్స మొదలుపెట్టగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

బంజారాహిల్స్‌లో కుక్కలలో లక్షణాలు..

బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు సమీపంలో కుక్కలకు జ్వరం, దగ్గు, జలుబు వంటి కొవిడ్ లక్షణాలు కన్పించాయని స్థానికులు చెబుతున్నారు. ఇవి
నీరసంగా కనిపిస్తూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. గత ఏప్రిల్ నెలలో నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్క్‌లో 8 సింహాలలో కొవిడ్ లక్షణాలతో అనారోగ్యానికి గురి కాగా, వాటికి కొవిడ్ పాజిటివ్ ఉందని సీసీఎంబీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందనే వాదనలకు బలం చేకూర్చినట్లైంది. చెన్నై‌లోనూ కొవిడ్‌తో సింహం మృతి చెందగా తాజాగా బంజారాహిల్స్‌లో కుక్కలలో లక్షణాలు కనబడటంతో ప్రజలలో ఆందోళన ఎక్కువైంది. మనుషులలో వచ్చిన కరోనా వైరస్ పెంపుడు జంతువులకు సోకె అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ కూడా స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంలో కరోనా సోకిన వ్యక్తులు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని చెప్పింది. సాధారణంగా వైరస్‌లు మానవులు-జంతువులు మధ్య ట్రాన్స్ మిట్ అయినపుడు జెనెటిక్ మార్పులు చెందే అవకాశాలు ఉంటాయని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆధారాలు లేవు..

జంతువులలో కొవిడ్ లక్షణాలు కన్పించినప్పటికీ వాటి నుండి మనుషులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, జంతువులు కూడా కొవిడ్ బారిన పడుతున్నాయనడానికి ఇటీవల చెన్నై‌లో సింహం మృతి చెందిన ఘటన, నగరంలోని నెహ్రూ జూ లాజికల్ పార్క్‌లో ఎనిమిది సింహాలలో లక్షణాలు కనబడడం వంటి సంఘటనలతో స్పష్టమైంది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారు వీలైనంత వరకు పెంపుడు జంతువుల దగ్గరికి వెళ్లక పోవడం మంచిది. జంతువులు అనారోగ్యానికి గురైతే వెంటనే స్థానికంగా ఉన్న పశువైద్యాధికారిని సంప్రదించాలి.
డాక్టర్ జే వెంకట్ రెడ్డి – వెటర్నరీ ఏడీ


Next Story