సీఎం జగన్ పై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

by  |
asaduddin-owaisi
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ఆరోపణలు చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తన సభకు జగన్ అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతా తిరిగేందుకు అనుమతి ఇచ్చిన జగన్ తనకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను సీఎం జగన్ గాలికి వదిలేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై ధ్వజమెత్తారు.

ఆదోనిలో తనను అడ్డుకునేందుకు సాయిప్రసాద్ రెడ్డి ప్రయత్నించారంటూ విరుచుకుపడ్డారు. ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తానని జగన్ అనడం సరికాదన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వొద్దని సూచించారు. ఆదోనిలో తన పర్యటనను అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు. మైనారిటీల ఓట్లతో అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారని అలాంటి వారే తమకు ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. ఇలా కొనసాగితే అన్ని స్థానాల్లో తాము పోటీ చేసి గెలుస్తామన్నారు. అంతేకాదు వైసిపి రెడ్ల పార్టీ అని.. టీడీపీ కమ్మ పార్టీ అని చెప్పుకొచ్చారు. ఈ రెండు పార్టీలకు పురపాలక ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు.


Next Story

Most Viewed