ఏపీ విద్యార్థులకిచ్చిన బార్డర్ పాసులు చెల్లవ్..

by  |
ఏపీ విద్యార్థులకిచ్చిన బార్డర్ పాసులు చెల్లవ్..
X

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్‌లోని ప్రైవేటు హాస్టళ్ళ మూసివేత ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గుదిబండగా మారింది. ‘లాక్‌డౌన్’లో భాగంగా నగరంలోని ప్రైవేటు హస్టళ్ళు మూతపడ్డాయి. అందులో ఉంటున్న విద్యార్థులను స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా స్పష్టం చేసి మెస్‌లను మూసేశారు నిర్వాహకులు. కోచింగ్, చదువు, ప్రైవేటు ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది విద్యార్థులు, బ్యాచ్‌లర్లు ప్రైవేటు హాస్టళ్ళలో ఉంటున్నారు. అయితే ఒక్కసారిగా ఇవి మూతపడడంతో నగర పోలీసు నుంచి ‘వన్ టైమ్’ పాస్‌లు తీసుకున్నారు. వేలాది పాస్‌లు జారీ అయ్యాయి. ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు స్వస్థలాలకు కార్లలో, బైక్‌లపైన బయలుదేరారు. గండం నుంచి గట్టెక్కామని సంతోషంతో ఎగిరి గంతేశారు.

కానీ అసలు కథ అక్కడే మొదలైంది. తెలంగాణ సరిహద్దు దాటి ఆంధ్ర బోర్డర్ వరకు వెళ్ళారు. కానీ అక్కడి పోలీసులు వీరిని అనుమతించలేదు. తెలంగాణ పోలీసు శాఖ జారీ చేసిన పాస్‌ల సంగతి తెలుసుకున్న ఆ రాష్ట్ర పోలీసులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్‌లోనే తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. లాక్‌డౌన్ జరుగుతూ, కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఒకచోటి నుంచి మరో చోటికి ప్రయాణం చేయడం, వందల సంఖ్యలో విద్యార్థులు రావడం ఆందోళనకరమైన అంశమని, అక్కడి హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడి ఆంధ్ర విద్యార్థులే అయినా అక్కడే ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. దీనికి తోడు రెండు రాష్ట్రాల సీఎంఓ అధికారులు కూడా ఈ విషయమై చర్చించుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులూ మాట్లాడుకున్నారు.

చివరకు తెలంగాణ నుంచి ఎవ్వరినీ బైటకు వెళ్ళడానికి అనుమతించవద్దని, ఆంధ్రప్రదేశ్‌లోకి అనుమతించబోమని ఆ రాష్ట్ర అధికారులు తేల్చి చెప్పారు. వైరస్ వేగంగా వ్యాపిస్తున్నందున ఇండ్లలోంచి బైటకు రావద్దని, ఇప్పుడు ఆంధ్రకు వస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఏర్పడుతుందని ఆంధ్ర అధికారులు చెప్పారు. ఎక్కడివారు అక్కడ ఉండడమే శ్రేయస్కరమని, ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కారం కోసం 1902 నెంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయవచ్చునని ఆ రాష్ట్ర అధికారులు నగరంలోని ఆంధ్ర విద్యార్థులకు వివరించారు.

నగరంలోని ప్రైవేట్ హాస్టళ్ళు సృష్టించిన గందరగోళంతో ఇక చేసేదేమీ లేక రంగంలోకి దిగిన కేటీఆర్ నగరంలోని హాస్టళ్ళను మూసేయడానికి వీల్లేదని, నగర మేయర్, జీహెచ్ఎంసీ అధికారులు దీనికి తగిన పరిష్కారం చేయాలని, హాస్టల్ నిర్వాహకులతో సమావేశం జరిపి యధావిధిగా తెరిచే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశం చివరకు డీజీపీ దగ్గరకు చేరుకుంది. వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసి పాస్‌లు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. వెంటనే పాస్‌ల జారీ నిలిచిపోయింది. అయితే అప్పటికే జారీ అయిన పాస్‌లతో రాష్ట్ర సరిహద్దు దాటి ఆంధ్ర బోర్డర్ వరకు చేరుకున్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అటు ఇంటికి వెళ్ళలేక ఇటు హైదరాబాద్‌లో ఉండలేక నడిరోడ్డుపై చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.

మొత్తానికి ఆంధ్ర విద్యార్థులకు సాయంత్రం నుంచి పాస్‌ల జారీ నిలిచిపోవడంతో నగరంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే నిత్యావసర వస్తువులను కొనుక్కోడానికి రోడ్లపైకి వెళ్ళేందుకు వీలుగా టూవీలర్ పాస్‌లను ఇవ్వాల్సిందిగా నగర వెస్ట్ జోన్ డీసీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ పాస్‌లను ఇవ్వడానికి ఇబ్బంది లేదని హామీ ఇవ్వడంతో కొంతలో కొంత ఉపశమనం లభించింది.

tags : Hyderabad, Corona, Hostels, Students, AP Government, CS, KTR, Mayor

Next Story

Most Viewed