నిఘా నేత్రాలున్నా.. కరువైన పర్యవేక్షణ

by  |
నిఘా నేత్రాలున్నా.. కరువైన పర్యవేక్షణ
X

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో దాదాపు 1.30 కోట్లు జనాభా ఉన్నట్టు అంచనా. ఒకప్పటి భాగ్యనగరం నుంచి నేటి గ్రేటర్ హైదరాబాద్ దాకా.. లేదంటే విశ్వనగరం దాకా అభివృద్ధిలో అనేక దశలను దాటుకుంటూ వస్తోంది. నగరం విస్తరిస్తున్న కొద్దీ జనాభా పెరుగుతుంది తప్ప.. జనాభాకు అనుగుణంగా నగర ప్రజలకు సౌకర్యాలు, సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. ప్రధానంగా శాంతి భద్రతల్లో మెరుగైన ఫలితాలు ఉన్నందునే ఇతర దేశాలకు చెందిన కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నారు. అందులో భాగంగానే పోలీసు శాఖ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలను నగర వ్యాప్తంగా అమర్చుతున్నారు.

అయినా ప్రమాదాల నివారణలో మాత్రం వైఫల్యం చెందుతూనే ఉన్నారు. ప్రస్తుతం నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో సుమారు 5 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఉన్నట్టు ఇటీవల ఓ సమావేశంలో మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. అందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3.50 లక్షలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారు 1 లక్ష, రాచకొండ పరిధిలో మిగతా సీసీ కెమెరాలు ఉన్నట్టు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా, సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నగరంలో మరో 10 వేల సీసీ టీవీ కెమెరాలను అమర్చుతోంది. మొత్తంగా లెక్కిస్తే.. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 5 లక్షలకు పైగానే సీసీ టీవీలు ఉన్నాయి. అందులో 3.50 లక్షల సీసీ టీవీ కెమెరాలను ప్రజలు తమ ఇళ్లల్లో, వ్యాపార దుకాణాలలో నేను సైతం కార్యక్రమంలో భాగంగా స్వయంగా అమర్చుకోగా, ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, సీఎస్ఆర్, దాతలు ద్వారా పోలీసులు ఏర్పాటు చేసినవి సుమారు 50 వేలు మాత్రమే ఉండటం గమనార్హం.

పర్యవేక్షణ లోపం..

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అమర్చిన సీసీ టీవీ కెమెరాలను ప్రధానంగా పోలీసు శాఖ పర్యవేక్షిస్తోంది. నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ ఒక సీసీ టీవీ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక కానిస్టేబుల్ కేటాయిస్తారు. వాస్తవానికి సీసీ టీవీ కెమెరాలను అమర్చేది దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలను ముందుగానే పసిగట్టి నిరోధించేందుకు, ఇతర ముఖ్యమైన అత్యవసరాలలో అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకోవడానికి అమర్చుతుంటారు. కానీ, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ టీవీ కెమెరాలను నిరంతరం లైవ్ లో పర్యవేక్షించే బాధ్యతలను మాత్రం చేపట్టడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత మాత్రమే పోలీసులు స్పందిస్తున్నారు. ఇటీవల హేమంత్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా… సీసీ టీవీ ఫుటేజీ కన్పిస్తున్నా, మళ్లీ హేమంత్ తల్లిదండ్రులు 100 కు డయల్ చేసి ఫిర్యాదు చేసే వరకూ స్పందన లేదు. పోలీసులు వచ్చేలోగా కిడ్నాప్ జరిగి, హత్య అయిన సంగతీ తెల్సిందే.

నిరంతరం నిఘా వైఫల్యం..

గ్రేటర్ హైదరాబాద్‌‌లో మంగళవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షంతో అతలాకుతలమైంది. రహదారులన్నీ చెరువులను తలపించాయి ఎక్కడికక్కడ భారీ వృక్షాలు పడిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా హిమాయత్ సాగర్ గేట్లు తెరిచిన తర్వాత పాతబస్తీ అంతా అల్లకల్లోలం అయ్యింది. ఈ సమయంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని, ఆపదలో ఉన్నవారిని ఒక్క సీసీ కెమెరా ద్వారా గ్రహించిన దాఖలాలు ఒక్కటి కూడా లేకుండా పోయింది. మనం లైవ్ కు వెళ్లి చూసే సరికి అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 5 లక్షల సీసీ టీవీ కెమెరాలు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది.



Next Story

Most Viewed