స్టిల్ నో క్లారిటీ.. పోటీ చేస్తారా, తప్పుకుంటారా..?

by  |
స్టిల్ నో క్లారిటీ.. పోటీ చేస్తారా, తప్పుకుంటారా..?
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీచేసే అభ్యర్థి ఎంపిక విషయంలో అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా.. లేక వెనకడుగు వేస్తుందా అన్న విషయం తేలక పార్టీ నేతలు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అభ్యర్థి విషయమై ఎవరిని కదిలించినా..? ఏమీ తెలియదు అనే సమాధానాలు ఇస్తున్నారు. అభ్యర్థి రంగంలో ఉంటాడో.. ఉండరో కూడా తనకు తెలియడం లేదని వాపోతున్నారు. నేడు.. రేపు అంటూ అధిష్టానం కాలయాపన చేస్తుండడంతో రోజురోజుకూ ఉత్కంఠ మరింతగా పెరుగుతోంది. సొంత పార్టీలోనే కాకుండా ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం అధికార పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపిన వారి గెలుపు పై నమ్మకం లేక ఆచితూచి అడుగులు వేస్తుందని పార్టీ ముఖ్య నేతలు కొందరు చెబుతున్నారు.

ఇక్కడ మీకు.. అక్కడ మాకు..

హైదరాబాద్- రంగారెడ్డి- హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తే వామపక్ష పార్టీల అభ్యర్థికి మద్దతిస్తాం.. నల్గొండ- వరంగల్- ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం లో మాకు మద్దతు ఇవ్వండి అని అధికార పార్టీ వామపక్ష పార్టీల ముందు ప్రస్తావించిన వారు పట్టించుకోకుండా, తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ క్రమంలో అధికార పార్టీకి ఏం చేయాలో పాలుపోక పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. వామపక్షాల అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు చెబుతూ వచ్చారు. కానీ నాగేశ్వర్ మాత్రం రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని అప్పుడే అధికార పార్టీ మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తే అంగీకరిస్తానని ఇటీవల జరిగిన ఓ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. దీంతో అధికార పార్టీ పునర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకటి రెండు రోజుల్లో స్పష్టత..

అభ్యర్థి ఎంపిక విషయంలో ఒకటి రెండు రోజులలో స్పష్టత రావొచ్చని అధికార పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. గతంలో ఎమ్మెల్యే స్థానానికి టికెట్ ఆశించిన లేదా మాజీ ఎమ్మెల్యేలు, ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లేని యెడల ఎవరికీ మద్దతు ఇవ్వకుండా ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

ప్రచారం ముమ్మరం చేసిన అభ్యర్థులు..

సిట్టింగ్స్ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్న హర్షవర్ధన్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని ప్రధాన కేంద్రాలలో ప్రచారాలు పూర్తి చేసుకొని మరోమారు ప్రచారాలకు సన్నద్ధమవుతున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాజీ మంత్రి చిన్నారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన నేపథ్యంలో టిక్కెట్ ఆశించిన హర్షవర్ధన్ రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా తప్పనిసరిగా పోటీలో ఉంటానని స్పష్టం చేయడంతో ఎన్నికల వేడి మరింతగా పెరగనుంది.



Next Story

Most Viewed