మహంతి ఈజ్ దేర్.. బీ కేర్!

by  |
మహంతి ఈజ్ దేర్.. బీ కేర్!
X

దిశ, హైదరాబాద్: సాధారణంగా సివిల్ సర్వెంట్లలో మహంతి కుటుంబ సభ్యులకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెల్సిందే. విధి నిర్వహణలో చిత్తశుద్ధి, నిజాయితీని ప్రదర్శిస్తూ పలువురికి ఆదర్శంగా నిలవడమే వీరి ప్రత్యేకత. అయితే, ఈ సిన్సియార్టీనే కొందరికి నచ్చకపోవడంతో ఇలాంటి అధికారుల పేర్లు చెప్పగానే చాలామంది ఉద్యోగులు వామ్మో అంటూ ఒకేసారి భయభ్రాంతులకు గురవుతారు. అయితే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ పోస్టు కేవలం ప్రోటోకాల్ ఉద్యోగమే అంటూ ప్రచారం ఉన్న నేపథ్యంలో అలాంటి స్ట్రిక్ట్ ఆఫీసరే బదిలీపై వచ్చారు. హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినవారిలో కలెక్టర్ శ్వేతామహంతి యంగ్ ఆఫీసర్ కావడం, అందులో మహాంతి అనే పేరు ఇప్పటికే సిన్సియర్ ట్యాగ్‌తో నగరానికి పరిచయం కావడంతో కలెక్టరేట్ పరిధిలోని వివిధ శాఖల అధికారులు హడలెత్తి పోతున్నారు.

హైదరాబాద్ కలెక్టర్‌గా శ్వేతామహంతి బాధ్యతలు చేపట్టి మూడు వారాలు గడిచాయి. అయితే వచ్చి రాగానే జిల్లా అధికారులతో ఆయా శాఖల సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోజూ రెండు లేదా మూడు శాఖల చొప్పున తీరిక లేకుండా రివ్యూలు చేపడుతున్నారు. ఏ శాఖలోనూ పెండింగ్ అనే పదానికి తావు లేకుండా ఎప్పటి ఫైళ్ళు అప్పుడే క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు. దీంతో అధికారులు నెలల తరబడి పెండింగ్ ఉన్న ఫైళ్లకు దుమ్ము దులిపేపనిలో నిమగ్నమయ్యారు. ఆయా కార్యాలయాల్లో ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల తదితర సంక్షేమ శాఖలతోపాటు విద్య, ఎంప్లాయిమెంటు తదితర శాఖలను సమీక్షించేందుకు షెడ్యూల్‌ను రూపొందించారు. ఆ ప్రకారమే శాఖల సమీక్షలు వరుస క్రమంలో చేపడుతున్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ద్వారా విద్యార్థులకు అందే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు పనులు 2019-20 ఏడాది ముగుస్తున్నా ఇప్పటివరకూ పూర్తి కాని పనులు ఇప్పుడు చకచకా నడుస్తున్నాయి. అంతే కాకుండా, బీసీ సంక్షేమ శాఖలో గతేడాది కంటే రూ.3.40 కోట్లు నిధులు అధికంగా మంజూరైతే స్వయంగా అధికారులే కళాశాలలకు తిరిగి విద్యార్థుల ఆన్‌లైన్ దరఖాస్తులు బీసీ సంక్షేమ కార్యాలయానికి అందజేయాలని కోరుతున్నారు. దీంతో 2018-19 విద్యా సంవత్సరానికి బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలు(ఎంటీఎఫ్), రీయంబర్స్‌మెంట్ (ఆర్టీఎఫ్) లకు 61 వేల 981 దరఖాస్తులు అందితే, ఈ ఏడాది (2019-20) కి 64 వేల 875 దరఖాస్తులు అందాయి. దీంతో కలెక్టర్ శ్వేతా మహంతి విధుల నిర్వహణలో ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

వాస్తవానికి ఆమె కలెక్టర్‌గా అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించడం లేదు. ఎవరి పని వారు చేయాలని చెబుతున్నారు. అయితే, గత కొంతకాలంగా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఇప్పటివరకూ పెండింగ్ పనులన్నీ ఒకేసారి చేయాలంటేనే ఎవరికైనా ఇబ్బందే. దీనిని కొందరు అధికారులు, సిబ్బంది ఉరుకులు, పరుగులుగా ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు భావిస్తున్నారు. అయితే, ఈ నెల 24 ప్రజావాణి కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన, గైర్హాజరైన 25 మంది అధికారులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా కలెక్టర్ శ్వేతా మహంతి పేరు చెప్పగానే అధికారులంతా హడలెత్తి పోతున్నారు. అయితే, హైదరాబాద్ కలెక్టర్ పోస్టు ప్రోటోకాల్‌కే పరిమితం కాదంటూ నిరూపించడంలో శ్వేతా మహంతి.. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో పరిపాలన కొనసాగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed