పేరుకే పెద్దాసుపత్రి.. అత్యవసరమైతే.. ప్రైవేటే దిక్కు!

by  |
Huzurnagar Area Hospital
X

దిశ, హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లాలో రెండో అతిపెద్ద ఆస్పత్రి. ప్రతిరోజు వందల మంది ఇక్కడకు చికిత్స కోసం వస్తారు. చుట్టు పక్కల ఏ ప్రమాదం జరిగినా ఇక్కడకే తరలిస్తారు. కానీ తగిన వసతులు, సిబ్బంది లేకపోవడంతో రోగులకు ఇక్కడ నిరాశే ఎదురవుతోంది.

ICU లేదు.. స్టాఫ్ లేరు

కోవిడ్ టైమ్‌లో 100 పడకల ఆసుపత్రిలో 69 బెడ్లతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినా.. కరోనా బాధితులు ప్రైవేట్ ఆస్పత్రుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎన్ని పడకలున్నా.. ఎమర్జెన్సీలో వైద్యం చేసే ఐసీయూ లేకపోవడం, సరిగ్గా వైద్యులు లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. కోవిడ్ వైద్యం కోసం చేరిన పేషంట్లకు ఆక్సిజన్ లెవల్స్ పరిక్షీంచడం తప్పా.. అంతకు మించి మరే ట్రీట్‌మెంట్ చేయలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి పరిస్థితి విషమిస్తే జిల్లా ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది.

స్టాఫ్ కోసం.. దశాబ్దాల నిరీక్షణ

పెద్ద ఆస్పత్రిని నిర్మించినా.. అందుకు తగిన సిబ్బందిని మాత్రం ప్రభుత్వం నియమించలేకపోతున్నది. వచ్చిన డాక్టర్లు నిలకడగా ఉండకపోవడం.. పనిచేసే వారిపై భారం పడటం వంటి కారణాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గత కొన్నేండ్లుగా ఆస్పత్రిలో ఐసీయూ సెటప్ బ్లడ్ బ్యాంక్, స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయి డాక్టర్ల నియామకం జరుగాలని ప్రజా సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలూ చేశాయి. ప్రజాప్రతినిధులకు, జిల్లా ఆఫీసర్లకు పదుల సంఖ్యలో వినతిపత్రాలు అందజేశారు. కానీ ఫలితం లేదు. ఐసీయూ సెటప్, ఎమర్జెన్సీ కేర్ స్టాఫ్ లేకపోవడంతో కోవిడ్ పేషంట్లకు అత్యవసర పరిస్థితిలో ఇచ్చే రెమిడిసివిర్ ఇంజక్షన్స్ సప్లయ్ కూడా లేదు. దీంతో దూర ప్రాంతాలకు వెళలేని బాధితులు ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలోనే దవాఖానాలో వసతులు కల్పించి ఉంటే కొవిడ్ సంక్షోభంలో ప్రజలకు ఈ ఇబ్బందులు ఉండకపోయేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డాక్టర్లు లేక.. ప్రాణాలు పోతున్నయ్

వంద పడకల ఆస్పత్రికి తగినట్లుగా 49 మంది ఉండాలి. కానీ, 7 గురు మాత్రమే పనిచేస్తున్నారు. తాజాగా.. మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో పాముకాటు గురైన పసికందును సమయానికి తీసుకొవచ్చినా.. రాత్రి సమయంలో ట్రీట్‌మెంట్ చేసే డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో బాలుడు మృతిచెందాడు. పెద్దాసుపత్రి ఉన్నా.. పేదలకు ప్రయోజనం లేదని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వసతులు సమకూర్చి, పూర్తిస్థాయిలో సరిపడా డాక్టర్లను నియమిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని మేధావులు, ప్రజాసంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story