హుజురాబాద్‌లో మైండ్‌గేమ్.. ఈటలవైపు దూసుకొస్తున్న కత్తులు

by  |
Huzurabad by-election
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తోన్న నేపథ్యంలో మైండ్ గేమ్ మొదలైంది. గతంలోనూ ఇలాంటి వ్యూహాలే ముందేసుకున్నారు. ఇప్పుడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం కంటే నేతల విమర్శలే పదునెక్కాయి. ఈటల రాజేందర్‌ను సెంటర్ పాయింట్‌గా చేసుకుని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుగా పొలిటికల్ హీట్ పెంచారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్​త్వరలోనే కాంగ్రెస్‌లోకి చేరుతారంటూ చెప్పడమే కాదు.. గతంలో ఈటల, రేవంత్​రెడ్డి కలిసి చర్చించారంటూ తెరపైకి తీసుకొచ్చారు. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎదురుదాడి చేయడం అనివార్యమైంది. ఇదే సమయంలో రేవంత్​రెడ్డి కూడా ప్రతిదాడిని పెంచారు. అసలు ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి పంపించిందే సీఎం కేసీఆర్ అని, ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఓ కాంట్రాక్టర్‌కు చెందిన హెలికాప్టర్‌ను వినియోగించారంటూ ప్రతివిమర్శలకు దిగారు.

గతంలోనూ అంతే

దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఇదే తరహా ఓ ప్రచారాన్ని పోలింగ్‌కు రెండు రోజుల ముందు తీసుకువచ్చింది. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి, దుబ్బాక అభ్యర్థిగా పోటీ చేసిన చెరుకు శ్రీనివాస్​రెడ్డి ఎన్నిక తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరుతారంటూ ప్రచారం చేసింది. అంతేకాకుండా ఓ మీడియాలో పదేపదే ప్రత్యేక కథనాలను వెలువరిచింది. ఈ పరిణామాలు కాంగ్రెస్​పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. వీటిని నమ్మడమా.. వదిలేయడమా అనేది పార్టీ నేతలను తేల్చుకోలేకుండా చేశాయి. ఎన్నికల్లో పోలింగ్ సమయంలో ఇలాంటి ప్రచారం అటు అభ్యర్థులు, ఇటు పార్టీకి కొంత ఇబ్బంది పరిస్థితులే తీసుకువస్తాయి.

ఇప్పుడు వ్యూహమేమిటి..?

తాజాగా.. టీఆర్‌ఎస్ ఈ మైండ్​గేమ్‌కు దిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని గాలికి వదిలేశాయి. అసలు ప్రచారపర్వంలో చెప్పాల్సిన సమస్యలు, హామీలన్నీ పక్కకు వెళ్లాయి. కేవలం నేతల విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్​నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదే సమయంలో ప్రచారానికి వెళ్లిన టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి కూడా ఇదే అంశంపై సుదీర్ఘ ఉపన్యాసం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఈటలను తాను కలిసింది నిజమేనని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎక్కడ, ఎలా, ఎందుకు కలుసుకున్నామనేది వివరిస్తున్నా.. దానికి అంతగా ప్రాధాన్యత రావడం లేదు. ఈ నేతలిద్దరు ఎందుకు కలిశారనేదే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే వీరిద్దరి భేటీ వాస్తవానికి ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్లకముందు జరిగిందే. కానీ, టీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడు లీక్ చేసింది. వాస్తవానికి బీజేపీలో చేరకముందు ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ మినహా.. నేతలందరితో భేటీ అయ్యారు. డీఎస్ నుంచి మొదలుకుని వీహెచ్ వరకు అందరినీ కలిశారు. అంతేగాకుండా అప్పుడు రేవంత్​రెడ్డి కూడా టీపీసీసీ చీఫ్ కాలేదు. కానీ ఇప్పుడు టీపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌పై, బీజేపీలో చేరి ఉప ఎన్నిక అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత ఈటలపై మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు ఎందుకనే చర్చ మొదలైంది.

అటు భట్టి అంశంలోనూ అంతే

కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసి టీఆర్‌ఎస్ విమర్శలకు దిగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల పలు సందర్భాల్లో కేటీఆర్.. పదేపదే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను వెనకేసుకురావడం, మంచి లీడర్‌గా చెప్పడం కూడా కాంగ్రెస్‌లో నేతలను పునరాలోచనలో పడేసింది. అంతేకాదు.. భట్టి విక్రమార్క త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే టీఆర్‌ఎస్‌లో చేరనంటూ భట్టి క్లారిటీ ఇచ్చుకుంటున్నా.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకే ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో పార్టీలన్నీ మైండ్​గేమ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీనిలో టీఆర్ఎస్ కొంత ముందుండగా.. వాటిని తిప్పికొట్టేందుకు ప్రతిపక్షాలు కష్టాలు పడాల్సి వస్తోంది.



Next Story