అక్కడ ఇల్లుంటే డబ్బులే డబ్బులు.. రోజుకు రూ.5 వేల అద్దె!

by  |
House Rent
X

దిశ, తెలంగాణ బ్యూరో : “ హుజురాబాద్​ పట్టణానికి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరం ఉండే ఎలబోతారం గ్రామం. హుజురాబాద్‌కు దగ్గరగా ఉన్నా.. ఈ గ్రామం హుస్నాబాద్​నియోజకవర్గంలో ఉంటోంది. ఇప్పుడు ఈ గ్రామంలో చిన్న పెంకుటిల్లు ఖాళీగా ఉన్నా.. మూడు రోజులకు రూ.15 వేలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది.’’

‘‘హుజురాబాద్​ మండలం కాట్రపల్లి శివారు మాణిక్యాపూర్​గ్రామం. భీమదేవరపల్లి మండలం, హుస్నాబాద్​పరిధికి వచ్చే ఈ గ్రామంలో కూడా ఆయా పార్టీల నేతలు ఇండ్లను కిరాయికి తీసుకుంటున్నారు. కేవలం మూడు, నాలుగు రోజుల కోసమే. ’’

హుజురాబాద్​ ఉప ఎన్నిక నేపథ్యంలో చుట్టు పక్కల నియోజకవర్గాల్లోని శివారు గ్రామాల్లో ఇండ్లను అద్దెకు ఇవ్వాలంటూ గ్రామస్తుల వెంట పడుతున్నారు. ఖాళీ లేవు అని చెప్పుతున్నా.. కనీసం ఒక్క గది అయినా ఇవ్వాలని పార్టీల నేతలు బతిమిలాడుతున్నారు. రోజుకు రూ.5 వేల చొప్పున రెంట్​ చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు.

వాస్తవానికి గత రెండు నెలల నుంచే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంతో కళాకారులు, కార్యకర్తలు, నేతలు, అనుచరులు ఉండేందుకు ఇళ్లకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. పోలింగ్‌ ముందు వరకు ఉండేందుకు ఒక్కో పార్టీ నుంచి నేతలు నెల, రెండు నెలల కోసం ఇప్పటికే కిరాయికి తీసుకున్నారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ఇండ్లను వదిలేస్తున్నారు.

అందుకే డిమాండ్​

ఈ నెల 27తో హుజురాబాద్​ సెగ్మెంట్‌లో బహిరంగ ప్రచారం ముగిసిపోనుంది. దీంతో స్థానికేతర నాయకులు మొత్తం సెగ్మెంట్‌ను ఖాళీ చేయాల్సిందే. ఇప్పటి వరకు హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో నేతలు భారీస్థాయిలో మకాం వేశారు. ఒక్కో ఇంటికి రూ.10 వేలకుపైగా కిరాయి ఇచ్చారు. అయితే ఇప్పుడు నియోజకవర్గాన్ని ఖాళీ చేయించాల్సి రావడంతో ఇప్పుడు హుజురాబాద్​సెగ్మెంట్‌కు ఆనుకుని ఉండే శివారు గ్రామాలపై కన్నేశారు. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గంలో మాత్రమే ఉండరాదనే నిబంధనలతో పక్క నియోజకవర్గాల్లో ఉండేందుకు ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఆనుకుని ఉండే హుస్నాబాద్​, మానకొండూరు, పెద్లపల్లి, పరకాల, వరంగల్​ పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని శివారు గ్రామాల్లో మకాం వేస్తున్నారు. హుస్నాబాద్​ నియోజకవర్గం పరిధిలోని సైదాపూర్​ మండలం ఎలబోతారం, రాములపల్లి, గొడిశాల, చింతలపల్లి, అగ్రహారం, ఎల్కతుర్తి మండలం పెంచికలపేట, జీల్గుల, కోతులనడుమ, వల్భాపూర్, పెద్దపల్లి నియోజకవర్గం పరిధి జమ్మికుంట, వీణవంక ప్రాంతాలను ఆనుకుని ఉండే కాల్వ శ్రీరాంపూర్​మండలం గుంపుల, తనగల, ఓదెల ప్రాంతాల్లో మకాం వేస్తున్నారు. ఇటు మానకొండూరు మండలం కొత్తగట్టు, మొలంగూర్​, కేశవపట్నం ప్రాంతాల్లోనూ ఉంటున్నారు. ఇటు పరకాల నడికుడ, అటు కమలాపూర్​ మండలాన్ని ఆనుకుని ఉండే వరంగల్​జిల్లా పరిధిలో నాగారం, ముచ్చర్ల గ్రామాల్లో స్థానికేతర నేతలు ఈ మూడు రోజులు ఉండేందుకు ఇండ్లను కిరాయికి తీసుకుంటున్నారు. అదేవిధంగా హుస్నాబాద్​సెగ్మెంట్​పరిధిలో భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్, వంగర, సైదాపూర్​మండలం అమ్మనగుర్తి, కొప్పూరు వంటి గ్రామాల్లో మకాం వేస్తున్నారు.

అదే కీలకం.. అందుకే మకాం

బహిరంగ ప్రచారం తర్వాత రెండు రోజులే అత్యంత కీలకం కానున్నాయి. ప్రధాన పార్టీలన్నీ పోల్​ మేనేజ్​మెంట్‌ను నమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులు ఓటర్లకు ప్రలోభాలను ఎర వేయనున్నారు. ప్రస్తుతం ఇక్కడ పార్టీలన్నీ స్థానిక నేతలను కాకుండా స్థానికేతర నేతలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. భారీ పంపకాలన్నీ వారి నుంచే సాగుతున్నాయి. ఉదాహరణగా అధికార పార్టీ నుంచి సిద్దిపేట, వరంగల్, పరకాల సెగ్మెంట్​లీడర్లే నగదు పంపిణీలో కీలకంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే నాయకులు చుట్టు పక్కల నియోజకవర్గాల్లోని శివారు గ్రామాల్లో మకాం వేస్తున్నారు.

ముందే ఉండండి

ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడం, ప్రలోభాలపైనే పార్టీలు ఎక్కువ ఫోకస్​చేయడంతో ఆయా పార్టీల అధిష్టానాల నుంచి కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్​ పరిధి కాకుండా పక్క నియోజకవర్గాల్లో శివారు గ్రామాల్లో ఉండాలంటూ ఆదేశాలిచ్చారు. దీంతో నేతలు ఇండ్ల వేటలో పడ్డారు.

ఇప్పటికే అంతా డంపింగ్​

ఇప్పటికే శివారు గ్రామాల్లో ఇండ్లను అద్దెకు తీసుకున్న నేతలు.. ప్రలోభాల కోసం భారీగానే నగదు డంపింగ్​చేశారనే చర్చ సాగుతోంది. దీనిపై కొన్నిచోట్ల అధికారులకు సైతం ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఇండ్లను అద్దెకు తీసుకుని వారికి కేటాయించిన ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు భారీ స్థాయిలో నగదు నిల్వలు చేశారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కాగా ఇప్పుడు ఎన్నికల సంఘం పక్క నియోజకవర్గాల్లో శివారు గ్రామాల పరిధిలో చెక్​పోస్టులు పెట్టి, తనిఖీలు చేయాలంటూ స్వచ్ఛంద సంస్థల నుంచి అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ.. అధికారులు మాత్రం ఇంకా స్పందించడం లేదు.



Next Story

Most Viewed