భార్య కాపురానికి రావడం లేదని.. దారుణానికి ఒడిగ‌ట్టిన భ‌ర్త

by  |
Husbands and wife
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వ‌రంగ‌ల్ అర్బన్ జిల్లా క‌రీమాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావ‌డం లేద‌ని కక్ష పెంచుకుని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆమెను త‌న‌తో పాటు మంట‌ల్లో కాలిపోయేలా చేశాడు. కొడుకు పుట్టిన రోజు వేడుక‌ల సాక్షిగా ఇద్దరు భార్యాభర్తలు బంధువులంతా చూస్తుండ‌గానే విగ‌త‌జీవులుగా మారారు. ఈ సంఘ‌ట‌న సోమ‌వారం ‌రాత్రి 10:30 గంట‌ల‌కు జ‌ర‌గ్గా, ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివరాళ్లోకి వెళితే.. బండి భాస్కర్, విజ‌య దంప‌తులు క‌రీమాబాద్ ప్రాంతంలో నివాస‌ముంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. భాస్కర్‌ కొద్ది రోజులుగా వ్యస‌నాల‌కు బానిస‌య్యాడు. ఈ క్రమంలోనే జ‌ల్సాల‌కు రూ.20 ల‌క్షల‌కు పైగా తెలిసిన వారందరి వ‌ద్ద అప్పు చేశాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఇటీవ‌లి కాలంలో ఒత్తిడి పెర‌గ‌డంతో పుట్టింటి నుంచి డ‌బ్బులు తీసుకురావాల‌ని భాస్కర్‌ భార్య విజ‌య‌ను వేధించ‌డం మొద‌లుపెట్టాడు.

అయితే పుట్టింటి నుంచి అంత స్థొమ‌త లేక‌పోవ‌డంతో ఆమె డ‌బ్బులు తీసుకురాలేన‌ని చెప్పింది. వేధింపులు ఎక్కువ కావ‌డంతో మూడు నెల‌ల కింద‌ట విజ‌య త‌న పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి త‌ల్లిగారింటి వ‌ద్దే ఉంటోంది. కాపురానికి రావాల‌ని భాస్కర్ చెబుతున్నా.. భ‌ర్త ప్రవ‌ర్తన‌తో విసిగిపోయిన విజ‌య అత‌నికి దూరంగా బ‌త‌కాల‌నే నిర్ణయించుకుంది. భ‌ర్త త‌న‌ను వ‌ర‌క‌ట్న వేధింపులకు గురి చేస్తున్నడంటూ విజ‌య మిల్స్ కాల‌నీ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు కూడా చేసింది. కొడుకును కావాల‌నే దూరం పెడుతోంద‌ని, త‌న‌ను ఒంట‌రి వాడిని చేసింద‌ని కోపంతో భాస్కర్ ర‌గిలిపోయాడు. సోమ‌వారం కొడుకు ఆశ్రిత్ పుట్టిన రోజు కావ‌డంతో ఎస్ఆర్‌ఆర్ తోటప్రాంతంలోని విజ‌య పుట్టింటికి చేరుకున్నాడు. మాట్లాడుతాన‌ని చెప్పి విజ‌య‌ను ప‌క్కకు పిలిచి త‌నకు నిప్పంటించుకుని ఆమెను చేతుల‌తో అదిమి ప‌ట్టుకున్నాడు. దీంతో ఇద్దరు మంట‌ల్లో చిక్కుకున్నారు. క్షణాల్లో మంట‌ల్లో ఇద్దరు ఆహుత‌య్యారు. అంద‌రూ చూస్తుండ‌గానే క‌ళ్ల ముందే ఇద్దరు ప్రాణాలు వ‌దిలారు.

Next Story

Most Viewed