ఆస్పత్రికని అడవిలోకి తీసుకెళ్లి.. భార్యను చంపిన భర్త

by  |
Husband killed wife
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ఆస్పత్రికని తీసుకెళ్లి భార్యను అత్యంత దారుణంగా హ‌త్య చేశాడు ఓ కిరాత‌కుడు. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు అడవిలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగింది. కేస‌ముద్రం మండ‌లం పెనుగొండ గ్రామానికి చెందిన న‌రేష్‌, స‌రిత(26) దంప‌తులు. వీరికి ఓ పాప. న‌రేష్ హైద‌రాబాద్‌లో డీసీఎం డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. వారం రోజుల క్రితం గ్రామానికి వ‌చ్చిన న‌రేష్.. భార్య స‌రిత వేరొక‌రితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తుంద‌న్న అనుమానంతో గొడ‌వ ప‌డ్డాడు. మూడు రోజుల కిత్రం స‌రితను తీవ్రంగా కొట్టాడు. ఆ దాడిలో ఆమె చేయి విరిగింది. అప్పటికీ న‌రేష్ కోపం చ‌ల్లార‌లేదు. స‌రిత‌ను అంతం చేయాల‌ని నిర్ణయంచుకున్నాడు. చేయి బాగు చేసేందుకు ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లుగా ఇరుగు పొరుగుకు చెప్పి మ‌హ‌బూబాబాద్‌కు భార్యను బైక్‌పై తీసుకు వ‌చ్చాడు.

ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ప‌ని ఉంద‌ని నమ్మబలికి బ‌య్యారం నామాల పాడు అట‌వీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. రోడ్డు పక్కన బైక్ ఆపి చెట్ల మధ్యలోకి భార్యను లాక్కెళ్లి వెంట తెచ్చుకున్న క‌త్తితో క‌డుపులో పొడిచాడు. ఆమె అరుపులు విన‌పడ‌కుండా గొంతు నులిమి చంపేశాడు. ఈ దృశ్యాల‌ను దూరం నుంచి కొంత‌మంది వాహ‌న‌దారులు గ‌మ‌నించారు. అయితే అక్కడి నుంచి న‌రేష్‌ జారుకునేందుకు య‌త్నిస్తుండ‌గా వారు అడ్డుకుని పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ప్రస్తుతం న‌రేష్ బ‌య్యారం పోలీసుల అదుపులో ఉన్నాడు. స‌రిత మృత‌దేహాన్ని మ‌హ‌బూబాబాద్ ఏరియా ఆస్పత్రికి త‌ర‌లించారు.


Next Story

Most Viewed