ధర్మారావుపేటలో దారుణం.. భార్యపై భర్త గొడ్డలితో దాడి

by  |
wife Injuried
X

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త గొడ్డలితో దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన గణపురం మండలం ధర్మారావుపేట గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంపల మొగిలికి కొంతకాలం క్రితం భార్యపై అనుమానం వచ్చి రెండుసార్లు కత్తితో ఆమెపై దాడి చేశాడు. అనంతరం కుల పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి తిరిగి కాపురం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో శ్యామలపై భర్త మొగిలికి మరోసారి అనుమానం వచ్చింది. దీంతో ఆగ్రహంతో ఆమెపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

చెంప పైభాగంలోని కంటి సమీపంలో రెండుచోట్ల గొడ్డలి వేటు పడింది. దీంతో ఒకవైపు పండ్లు అక్కడే ఊడిపడ్డాయి. కడుపు భాగంలో సైతం గొడ్డలితో నరకడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడనుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం శ్యామల ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. శ్యామలకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed