మద్యం తాగొద్దన్నందుకు గొడ్డలితో నరికాడు

by  |
మద్యం తాగొద్దన్నందుకు గొడ్డలితో నరికాడు
X

దిశ, మహేశ్వరం : కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. భార్యను అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కందుకూరు సీఐ కృష్ణంరాజు కథనం ప్రకారం.. కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఏర్గమోని మహేందర్‌కు కందుకూరు మండలం మీర్ఖాన్ పేట్ చెందిన సారమ్మ(33)తో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు జస్వంత్ (13) కూతురు తేజ (10). మహేందర్ సారమ్మను బాగానే చూసుకున్నాడు. ఇటీవల మహేందర్ మద్యానికి బానిసై డబ్బులన్నీ ఖర్చుపెడుతుండటంతో సారమ్మ పలుమార్లు మందలించింది.

ఈ విషయాన్ని ఆమె అతని తల్లిదండ్రులకు చెప్పినా మహేందర్‌లో ఎటువంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే మహేందర్ శనివారం రాత్రి 11:40 సమయంలో భార్యతో గొడవపడ్డాడు. సహనం కోల్పోయిన అతను కొడుకు జస్వంత్, కూతురు తేజ పక్క గదిలో బంధించి గొడ్డలితో భార్య మెడపై అతికిరాతకంగా నరికాడు. అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. పక్క గదిలో ఉన్న పిల్లలు కేకలు వేయడంతో పక్కింటివారు వచ్చి డోర్‌ తీశారు. మద్యం తాగొద్దని చెప్పినందుకే మహేందర్ భార్యను గొడ్డలితో చంపాడని సారమ్మ కుటుంబ సభ్యులు, వారి పిల్లలు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed