పెళ్లైన నెలకే.. భార్య గొంతు కోసి దారుణ హత్య.. ఆపై తానూ!

by  |
పెళ్లైన నెలకే.. భార్య గొంతు కోసి దారుణ హత్య.. ఆపై తానూ!
X

దిశ, కామారెడ్డి : పెళ్ళైన రెండు రోజుల నుంచే భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు ఆ భర్త. చివరికు ఆమె గొంతు, కాళ్ళు చేతులు కోసి హత్యచేశాడు కిరాతకంగా హత్యచేశాడు. పైగా తాను కూడా గొంతు, ఎడమ చేయి కోసుకుని ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాదులోని ప్రగతి నగర్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

అమ్మాయి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆయన కూతురు సుధారాణిని కామారెడ్డి పట్టణానికి చెందిన ఎర్రోళ్ల కిరణ్ కుమార్‌తో గత నెల 27 న అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 14 లక్షల నగదు, కామారెడ్డిలో ఒక ప్లాట్, సుమారు 10 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. అయితే, పెళ్ళైన రెండు రోజుల నుంచే భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు భర్త కిరణ్ కుమార్. అన్నదమ్ములు, ఇతరులు ఎవరితో మాట్లాడనిచ్చే వాడు కాదు. కొద్దిరోజుల కిందట ఒకసారి సుధారాణిపై అనుమానంతో గొంతు నులిమి చంపడానికి కూడా ప్రయత్నించాడు కసాయి భర్త. విషయం తెలిసిన సుధారాణి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో మందలించారు. అయినా, అతని తీరు మారలేదు. వారం రోజుల కిందట సుధారాణిని తీసుకుని హైదరాబాదులోని ప్రగతి నగర్లో ఉన్నఇంటికి వెళ్లారు. అయితే, శనివారం కిరణ్ కుమార్ తల్లిదండ్రులు సుధారాణి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయిని చూడక చాలా రోజులైంది కదా ఒక్కసారి వచ్చి వెళ్ళండని సుధారాణి పేరెంట్స్‌కు ఫోన్ చేశారు.

దీంతో సుధారాణి తల్లిదండ్రులు హైదరాబాద్ బయలుదేరారు. అదే సమయంలో కిరణ్ కుమార్ పేరెంట్స్ కూడా హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చేశారు. మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌లోని తన కూతురు ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. పిలిస్తే ఎవరూ పలకలేదు. పడుకున్నారేమోనని భావించి మూడు గంటల వరకు వేచి చూసి మరోసారి పిలిచారు. ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో కామారెడ్డిలోని తమ బంధువులకు సమాచారమిచ్చారు. వాళ్ళు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుని ఇంటికి వచ్చి ఎంత పిలిచినా ఉలుకుపలుకు లేదు.

విషయం పోలీసుల చేరడంతో వారు అక్కడికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. గొంతు, కాళ్ళు, కోసి విగతజీవిగా ఉన్న తమ కూతురును చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. భార్య గొంతుకోసి హత్య చేసిన కిరణ్ తాను కూడా ఎడమ చేయి, గొంతు కోసుకున్నాడు. వెంటనే కిరణ్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. సోమవారానికి కిరణ్, సుధారాణిలకు పెళ్లి జరిగి సరిగ్గా నెల రోజులు కావొస్తుంది. పెళ్ళైన నెల రోజులకే తమ కూతురుని పొట్టన పెట్టుకున్న కిరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమ్మాయి బంధువులు కామారెడ్డిలోని అతని ఇంటిపై దాడికి పాల్పడ్డారు. కిరణ్ తల్లిదండ్రులు బాత్‌రూంలో దాక్కున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ బాత్ రూమ్ డోర్, ఇంట్లోని వాషింగ్ మిషన్, ఫ్రిజ్, ఇతర ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బందోబస్తు చేపట్టారు. హైదరాబాదులో సుధారాణి పంచనామా పూర్తయిన తరువాత మృతదేహాన్ని నేరుగా కామారెడ్డిలోని కిరణ్ ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆందోళనలు నిర్వహించనున్నట్టు బాధిత కుటుంబం పేర్కొన్నట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed