భార్య తాగాక మిగిలిన పురుగుల మందు తాగిన భర్త..

by  |
భార్య తాగాక మిగిలిన పురుగుల మందు తాగిన భర్త..
X

దిశ, జడ్చర్ల : కుటుంబ కలహాలతో భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శనివారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో శనివారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఏక్వయా పల్లి గ్రామానికి చెందిన మేడిపల్లి విష్ణువర్ధన్ రెడ్డి (55 )కళావతి( 50) భార్య భర్తలు. విష్ణువర్ధన్ రెడ్డి ప్రతిరోజూ ఫుల్లుగా మద్యం తాగి వస్తుండగా.. భార్య కళావతి గొడవ చేసేది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగిపోయాయి. శుక్రవారం రాత్రి భర్త విష్ణువర్ధన్ రెడ్డి మద్యం సేవించి ఇంటికి రావడంతో ఇద్దరు గొడవ పడ్డారు. దీంతో విష్ణు వర్ధన్ రెడ్డి భార్య కళావతిని కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య కళావతి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి యత్నించింది.

గమనించిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా తన భార్య చనిపోతే ఎక్కడ తనకు మీదకు వస్తుందేమో అని భయపడి క్షణికావేశంలో భార్య తాగి వదిలేసిన పురుగుల మందును తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇరువురు అపస్మారక స్థితికి చేరుకోగా స్థానికులు 108 సాయంతో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కళావతి మార్గమధ్యలో మృతి చెందింది. విష్ణువర్ధన్ రెడ్డి జడ్చర్ల కమిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారికి వివాహాలు అయ్యాయని మృతుల కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లని తెలిసింది. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు జడ్చర్ల టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు.


Next Story

Most Viewed