పిల్లల ఎదుటే భార్యభర్తలు దుర్మరణం

by  |
road accident
X

దిశ, కోదాడ : మరి కొద్ది సమయంలో ఇంటికి చేరుతామనుకున్న వారిని మృత్యులు కబలించింది. ఎదురుగా బైక్ రూపంలో వచ్చి భార్యభర్తలను ఎగురేసుకుపోయింది. అప్పటి వరకు అమ్మానాన్నల ఒడిలో ఉన్న చిన్నారులు అనాథలుగా మారారు. తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి కొట్టుకుంటున్న సమయంలో ఇద్దరు పిల్లల ఆర్తనాదాలు అక్కడి వారిని కదిలించాయి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారామపురం స్టేజీ వద్ద సోమవారం రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దంపతులు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

కోదాడ పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్, నసీమా దంపతులు గుంటూరు జిల్లా దాచేపల్లికి వెళ్లి తిరిగి కోదాడకు వస్తున్నారు. చిలుకూరు మండలం సీతారామపురం ఎఫ్‌సీఐ గోదాము దగ్గరకు రాగానే కోదాడ నుంచి హుజూర్ నగర్ వెళ్తున్న మరో ద్విచక్రవాహనం ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షేక్ మహమ్మద్(35) అక్కడికక్కడే మృతిచెందగా, నసీమా(30) తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానికులు హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది.

Bikes Accident

కాగా, ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. ప్రమాద సమయంలో ఇద్దరు చిన్నారులు కూడా అదే బైక్‌పై ఉన్నారు. వారి ముందు బ్యాగులు ఉండటంతో చిన్నచిన్న గాయాలతో బయట పడ్డారు. తల్లిదండ్రులు విగతజీవులుగా పడి ఉన్న దృశ్యాన్ని చూసి పిల్లలు గుండెలు అవిసేలా రోదిస్తున్న తీరును చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. తల్లీతండ్రి ఇద్దరు మృతిచెందడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. కాగా ప్రమాదంపై తమకు ఇప్పటి వరకు ఫిర్యాదు అందలేదని చిలుకూరు ఎస్ఐ నాగభూషణరావు పేర్కొన్నారు.


Next Story