భార్య వివాహేతర సంబంధం..అత్తతో కలిసి అల్లుడు కిరాతకం

by  |
భార్య వివాహేతర సంబంధం..అత్తతో కలిసి అల్లుడు కిరాతకం
X

దిశ, వెబ్ డెస్క్: చక్కటి కుటుంబం. ఇద్దరు కుమారులు. భార్య మాట జవదాటని భర్త. ఇంతటి చక్కటి కుటుంబంలో ఆమె తప్పటడుగులు వేసింది. భర్త ఉన్నాసరే పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకునేది. ఊర్లో పరువుపోతుందని పద్ధతి మార్చుకోవాలని భర్త.. ఆమె తల్లి పలు మార్లు హెచ్చరించారు. అయినా ఆమెలో ఎలాంటి మార్పురాలేదు. దీంతో కోపోద్రిక్తులైన భర్త, ఆమె తల్లి దారుణంగా హత్య చేశారు. ఈ షాకింగ్ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే లోవదేవస్థానంలో సన్నాయి వాయిద్యకారుడు చింతపల్లి సత్యనారాయణ 2004లో తన అక్క కుమార్తె ఆదిలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.

వీరికి పదో తరగతి చదువుతున్న రమేష్‌ నాలుగో తరగతి చదువుతున్న మరో కుమారుడు ఉన్నారు. తుని మార్కండ్రాజు పేటలో ఈ కుటుంబం జీవిస్తోంది. ఆదిలక్ష్మి కొందరితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోంది. దీంతో ఆమె భర్త, తల్లి సత్తెమ్మ తరచూ మందలించేవారు. పరువుపోతోందని బాధపడేవారు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో విసిగిపోయారు. ఫిబ్రవరి 28న సత్తెమ్మ, ఆమె అల్లుడు కలిసి ఆదిలక్ష్మి తలపై సుత్తితో బలంగా కొట్టారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి స్కూటీ వాహనం ముందు పెట్టుకుని సత్యనారాయణ కొత్తవెలంపేట శివారు మామిడి తోటకు తరలించాడు.

అక్కడ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఎవరైనా చూస్తారన్న భయంతో వెంటనే తిరిగి వచ్చేశాడు. సగం కాలిన మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. హైవే సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తుండగా సత్యనారాయణ, సత్తెమ్మ బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. తామే చంపామని అంగీకరించారు. దీంతో ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తల్లి హత్యకు గురికాగా తండ్రి, అమ్మమ్మ జైలుపాలవ్వడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

Next Story

Most Viewed