స్పాట్ బిల్లర్లపై ‘స్మార్ట్’గా వేటు

by  |
స్పాట్ బిల్లర్లపై ‘స్మార్ట్’గా వేటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెంట్రల్​ఎలక్ట్రిసిటీ అథారిటీ తీసుకున్న నిర్ణయంతో విద్యుత్​శాఖలో ఔట్​సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న స్పాట్​బిల్లర్ల జీవితాలు రోడ్డునపడే అవకాశం ఉంది.
ప్రస్తుతమున్న మీటర్ల స్థానంలో దేశవ్యాప్తంగా స్మార్ట్​మీటర్లు లేదా ప్రీపెయిడ్​మీటర్లు తీసుకురావాలని కేంద్ర విద్యుత్​మంత్రిత్వ శాఖ ప్రణాళికలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటనను విడుదల చేసి వినియోగదారుల నుంచి అభ్యంతరాలు కోరింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండువేల మందికిపైగా స్పాట్ బిల్లర్లు ఔట్​సోర్సింగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. వీరిని పీస్​రేట్లుగా కూడా పిలుస్తారు. ఎన్ని మీటర్​రీడింగులు కొడితే అంత నగదు ఇస్తారు కాబట్టి అలా పిలుస్తుంటారు. అయితే వీరికి నిర్ధిష్ట వేతనమనేది లేకపోవడం వల్ల ఏజెన్సీలు ఎంతిస్తే అంత తీసుకోవాల్సి వస్తోంది. ఒక్క మీటర్​రీడింగ్​కు ఒక్క రూపాయిగా కాంట్రాక్టర్లు వీరికి చెల్లిస్తున్నారు. కొన్ని ఏజెన్సీలైతే రూ.50 పైసలు చెల్లిస్తూ వారిని వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకుని వచ్చినంతలో జీవనం సాగిస్తున్న స్పాట్ బిల్లర్లు ఉన్న ఉపాధి కూడా పోతే తాము బతికేదెలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కార్మికులపై స్మార్ట్, ప్రీపెయిడ్ మీటర్ల రూపంలో పిడుగు పడినట్లయింది.

వేటు తప్పదా?

ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానాన్ని స్మార్ట్, ప్రీపెయిడ్​మీటర్లు భర్తీచేస్తే స్పాట్ బిల్లర్లకు ఉపాధి ఉండదు. గతంలో స్పాట్​బిల్లర్​వచ్చి రీడింగ్ చూస్తే కానీ విద్యుత్​బిల్లు ఎంత వచ్చిందనేది తెలిసేది కాదు. కానీ స్మార్ట్​మీటర్ల పనితీరు అలా ఉండదు. ఎప్పటికప్పుడు ఫోన్లలోనే మనం ఎంత బిల్లు వినియోగించామో తెలుసుకోవచ్చు. అంతేకాదు బిల్​పేమెంట్​కూడా ఆన్​లైన్​లోనే చేయాల్సి ఉంటుంది. దీంతో స్పాట్ బిల్లర్లకు ఉపాధి ఉండదనే విషయం స్పష్టమవుతోంది. అయితే తమను ఉద్యోగంలో ఉంచుతారా? తొలగిస్తారా? లేదా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతారా? అనే ఆందోళన నెలకొంది.

కార్మికుల పొట్టకొట్టొద్దు

విద్యుత్​శాఖలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా స్మార్ట్​మీటర్లు, ప్రీపెయిడ్​మీటర్లను తీసుకొచ్చి కార్మికుల పొట్టకొట్టొద్దు. ఇతర దేశాలను చూసి అప్​డేట్​అవ్వడం మంచిదే.. కానీ దానికంటే ముందు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్​అందించాలి. విద్యుత్​శాఖలో పనిచేస్తున్న ఆర్టీజన్లు, ఎందరో కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి ఉపాధి కల్పించేందుకు కృషిచేయాలి.

Next Story