వామ్మో.. విశాఖలో మనిషి పుర్రె

by  |
వామ్మో.. విశాఖలో మనిషి పుర్రె
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో మనిషి పుర్రె కలకలం రేపింది. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెల్లివీధిలో ఓ పాడుబడ్డ ఇంట్లో మనిషి పుర్రెను గుర్తించారు. దీంతో అక్కడ కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన ఇంటిపక్కనే ఉన్న ఓ గోనె సంచిని గమనించాడు. అనంతరం అక్కడికి వెళ్లి ఆ సంచిని పరిశీలించగా అందులో మనిషి పుర్రె కనిపించింది. వెంటనే భయాందోళన చెంది పక్కనే ఉండే రాజును ఈ విషయమై నిలదీశాడు. నీవే తీసుకొచ్చి ఉంటావని రాజును ప్రశ్నించాడు.

ఈ సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రాజు.. పుర్రె ఉన్న ఆ గోనె సంచిని ఇంట్లోకి తీసుకుని వెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. అనంతరం రాజు ఇంట్లో ఉన్న ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, ఈలోగా రాజు అక్కడి నుంచి పరారయ్యాడు.

రాజు తండ్రి గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడని, అప్పటి నుంచి రాజు తాగుడుకు, చెడు వ్యసనాలకు బానిసయ్యాడని, ఈ క్రమంలో రాజు తల్లి అతడి నుంచి దూరంగా ఉంటోందని స్థానికులు పోలీసులకు తెలిపారు. రాజు దొంగతనాలకు పాల్పడేవాడని, అప్పుడప్పుడు శ్మశానాల వద్దకు వెళ్తుంటాడని కూడా స్థానికులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్మశానాల నుంచి రాజు ఈ పుర్రెను తీసుకొచ్చి ఉంటాడని భావిస్తున్నారు.


Next Story

Most Viewed