కన్యాదానం స్టోరీ రిపీట్.. భార్యను ప్రియుడికి అప్పజెప్పిన భర్త

by  |
కన్యాదానం స్టోరీ రిపీట్.. భార్యను ప్రియుడికి అప్పజెప్పిన భర్త
X

దిశ, ఫీచర్స్ : శ్రీకాంత్, ఉపేంద్ర హీరోలుగా నటించిన ‘కన్యాదానం’ సినిమా గుర్తుండే ఉంటుంది. తన భార్య(రచన) తనతో హ్యాపీగా లేదని, ఇప్పటికీ ప్రియుడు(ఉపేంద్ర)నే ప్రేమిస్తుందని తెలుసుకున్న భర్త(శ్రీకాంత్).. తన భార్యను ప్రియుడికే ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధపడతాడు. ఇది రీల్ లైఫ్ కాగా, రియల్ లైఫ్‌లోనూ ఇదే స్టోరీ రిపీట్ అయింది. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి.. తన భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేయడం చర్చనీయాంశమైంది.

బిహార్‌లోని భగల్‌పూర్ జిల్లా, సుల్తాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఉత్తమ్ మండల్.. ఖగరియాకు చెందిన స్వప్నకుమారిని 2014లో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. అయితే గతంలో స్వప్నకుమారి తన దగ్గరి బంధువైన రాజు కుమార్‌ను ప్రేమించింది. కానీ వారి ప్రేమ పెళ్లి దాకా రాలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరగ్గా, సర్దిచెప్పిన పెద్దలు ఇకపై కలిసే ఉంటారనుకున్నారు. కానీ స్వప్న మాత్రం రాజును మరిచిపోలేకపోయింది. ఈ క్రమంలో స్వప్న ప్రేమను అర్థం చేసుకున్న ఉత్తమ్.. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. రాజుతో స్వప్నకు పెళ్లి జరిపించాలని నిర్ణయించాడు. ఇందుకు కుటుంబీకులను సైతం ఒప్పించాడు. ఎట్టకేలకు ఇటీవలే రాజు-స్వప్నల వివాహం వైభవంగా జరగడంతో కథ సుఖాంతమైంది.

కాగా మొదట్లో ఈ విషయం తెలిసినప్పుడు చాలా కోపం వచ్చిందని, కానీ ఆ తర్వాత సమస్యకు పరిష్కారం ఆలోచించి పెళ్లి జరిపించానని చెప్పుకొచ్చాడు ఉత్తమ్. కాగా ఉత్తమ్-స్వప్నలకు జన్మించిన ఇద్దరు పిల్లలు ఉత్తమ్ వద్దనే ఉంటారని ఆయన పేర్కొనడం గమనార్హం.


Next Story