టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నియామకం వెనుక చంద్రబాబు భారీ స్కెచ్

by  |
టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నియామకం వెనుక చంద్రబాబు భారీ స్కెచ్
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బక్కని నర్సింహులను సోమవారం నియమించారు. ఈ నియామకం వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో అధికారంలోకి వస్తే దళితుడే సీఎం అని ప్రచారం చేశారు. కానీ ఇప్పటివరకు దళితుడిని సీఎం చేసింది లేదు. ప్రస్తుతం జరగబోయే హుజురాబాద్ ఎన్నికల క్రమంలో ఎస్సీ సాధికారిత అనే పథకం ప్రవేశపెట్టారు. దీంతో టీఆర్ఎస్ నేతలు దళితులను ఆకట్టుకునే ప్రయాత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దళిత సామాజికవర్గానికి చెందిన బక్కని నర్సింహులను నియమించడంతో రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతుంది.

లీడర్లను చేసిన పార్టీ టీడీపీ

తెలుగుదేశం పార్టీ అంటేనే నాయకుల తయారీ పరిశ్రమ అనే పేరు ఉంది. రాజకీయ వారసత్వంలేని ఎంతోమంది అనామకులను నేతలుగా తీర్చిదిద్దిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ కోవలోనే ఎల్.రమణకు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా తెలుగుదేశంలో పదవులు అనుభవించిన నేతలున్నారు. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కని సామాన్య నేతలకు పార్టీలో ప్రాధాన్యతనిచ్చి ఫ్లైట్ ఎక్కించిన సందర్భాలున్నాయి. కానీ అవకాశాలకు అనుగుణంగా పార్టీలు మారే నేతలతో టీడీపీకి తలనొప్పిగా మారిపోయింది. మొన్నటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్న ఎల్.రమణ అధికార పార్టీలో చేరి పదవులు అనుభవించాలనే లక్ష్యంతో వెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కారెక్కని నేతలకే అధ్యక్ష పదవి కట్టాబెట్టాలని పార్టీ ఆలోచించినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే బక్కనిని నియమించినట్లు సమాచారం. ఒకానొక దశలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు నర్సింహులు వెనకడుగు వేసినట్లు ప్రచారం సాగింది. కానీ పార్టీకి విధేయుడిగా, నమ్మిన కార్యకర్తలకు చేదోడోవాదోడుగా అందుబాటులో ఉంటూ బాబు దృష్టిలోనున్నారు. ఎన్నో అవకాశాలు అధికార పార్టీ నుంచి వచ్చినప్పటికి పార్టీ మారకుండా ఒక్కసారి ఎమ్మెల్యే చేసిన పార్టీలోనే క్రమశిక్షణగల నేతగా కొనసాగడం విశేషం. ఇవన్ని దృష్టిలో పెట్టుకొని అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ నిర్ణయాలకు చెక్

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలతో దళిత బహుజనులు, బీసీలు నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశంలో నాయకులకు కొదవలేదు. ఈ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎందరినో నాయకులకు నీడనిచ్చిన పార్టీగా గుర్తింపు ఉంది. ఒకప్పుడు బీసీలోని పద్మశాలి, గౌడ్, యాదవ్, ముదిరాజ్, ఎస్సీ లాంటి నేతలందరూ ఎదిగినవాళ్లే ఉన్నారు. బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ తెలంగాణలోనూ బలహీన వర్గాల ప్రజలకే రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. అంతేకాకుండా 2014 ఎన్నికల సందర్భంలో బీసీలకే రాష్ట్ర ముఖ్యమంత్రి అని నినాదంతో ముందుకు పోయింది. ప్రజల ఆదరణ లేకపోవడంతో తగినన్ని స్ధానాలను దక్కించుకోవడంలో విఫలమైపోయింది. అయినప్పటికి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే టీటీడీపీ అధ్యక్షుడిగా కొనసాగించింది. ఇప్పుడు దళితుడిని అధ్యక్ష పదవిని ఇచ్చి గౌరవిచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తమ నిబద్దతను చాటుకుంటుంది. తెలుగుదేశంలో వెలుగు వెలిగిన బక్కని నర్సింహులు.. పార్టీలో తొలినుంచి క్రియాశీలకంగా ఉన్నారు. కీలకపదవులు వచ్చినట్లే వచ్చి చేజారుతున్నాయనే సానుభూతి ఉంది. పార్టీ విపత్కర పరిస్థితుల్లో అధ్యక్ష పదవి చేపట్టి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఇదే సరైన అవకాశమని బాబు భావించినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed