హైదరాబాద్‌లో మిస్సింగ్‌ల మిస్టరీ

by  |
హైదరాబాద్‌లో మిస్సింగ్‌ల మిస్టరీ
X

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కరోజులోనే మూడు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసుల్లో మొత్తం నలుగురు మిస్ అయినట్టుగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అందులో ముగ్గురు యువతులే కావడం ప్రస్తుతం అందరిని కలవరపరుస్తోంది. ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్ కావడం పోలీసులకు సైతం అంతుపట్టడం లేదు.

మూడేండ్లుగా నిమ్స్ ఆస్పత్రి క్వార్టర్స్‌లో నివసిస్తున్న అనుగ అంజయ్య కూతురు(20) గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంటర్వ్యూ కోసం ఇంటి నుంచి వెళ్లింది. ఆ తర్వాత ఫోన్ స్విఛాఫ్ అయ్యింది. స్నేహితులు, బంధువుల ఇండ్లల్లోనూ ఆమె తండ్రి విచారించారు. ఫలితం లేకపోవడంతో పీఎస్ లో తండ్రి అంజయ్య శుక్రవారం ఫిర్యాదు చేశారు.

గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన గరికపాటి శాంతికుమారి తన భర్తతో కలిసి ఖైరతాబాద్ ప్రేమ్ నగర్‌‌లో రెండేండ్లుగా నివాసం ఉంటోంది. నార్సింగ్ కు చెందిన ఆమె సోదరి కుమార్తెలు సగ్గం సుమిత్ర (15), సగ్గం పవిత్ర (18)లు ఈ నెల 26న ఖైరతాబాద్ కు వచ్చారు. గరికపాటి శాంతికుమారి కుమార్తె పావనితో కలిసి గురువారం (ఈ నెల 29న) సోదరి కుమార్తెలు సుమిత్ర, పవిత్రలు 11.45 గంటలకు డక్కెన్ చర్చికి వెళ్లారు. ఈ సమయంలో గరికపాటి పావని మాత్రమే ఇంటికి తిరిగొచ్చింది.. మిగతా ఇద్దరు ట్యాంక్ బండ్ చూడడానికి వెళ్లినట్టు ఇంట్లో చెప్పింది. కానీ, వారు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు.

ఖైరతాబాద్ ప్రేమ్ నగర్ కు చెందిన మతి స్థిమితం లేని ఆర్.నాగేశ్వరరావు (44) ఈ నెల 26న టిఫిన్ చేసి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కాగా ఆయన తిరిగి రాకపోవడంతో పోలీసు స్టేషన్ లో ఆయన సోదరి ఫిర్యాదు చేసింది.

వారంలో 200లకు పైగా మిస్సింగ్‌లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటీవల అధికంగా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు పోలీసులను హడలెత్తిస్తున్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే శుక్రవారం ఒక్కరోజే ముగ్గురు యువతులు మిస్సింగ్ అయినట్టు కేసులు నమోదు కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా, ఈ వారం రోజుల్లోనే నగరంలో దాదాపు 200 లకు పైగా మిస్సింగ్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీంతో మిస్సింగ్ కేసులను చేధించడం నగర పోలీసులకు సవాల్‌గా నిలిచింది.

మిస్ అవుతున్న వారిలో యువతులు కూడా ఉన్నందున పోలీసులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ కేసులను కొలిక్కి తీసుకురావడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ వారంలో రోజుల్లోనే వందల కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 26న 65 మంది, 27న 62 మంది, 28వ తేదీన 65 మంది మిస్ అయినట్టు విశ్వసనీనయ సమాచారం.



Next Story

Most Viewed