పువ్వులు వికసించె.. కొనేవారులేక రైతు విలపించె

by  |
పువ్వులు వికసించె.. కొనేవారులేక రైతు విలపించె
X

దిశ, రంగారెడ్డి: ఆశలు విత్తితే.. పువ్వులు వికసించాయి. రైతు ముఖంలో నవ్వులు పూసాయి.. కానీ, పొలంలో పువ్వులు అలాగే ఉన్నాయి, కానీ, ఆ రైతు ఇంటా ఆ నవ్వులు మాయమయ్యాయి. కరోనా దెబ్బకు పూలరైతు విలపిస్తున్నాడు. పూలసాగుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పెట్టింది పేరు. జిల్లాల్లో అత్యధిక సాగు విస్తీర్ణం ఇక్కడే. ఏటా మాదిరిగానే ఈసారి అధిక పెట్టుబడి పెట్టి రైతులు పూలు సాగు చేశారు. కాని ఇప్పుడు పంట ఎగుమతులు చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మార్కెట్లూ మూతపడ్డాయి. దీంతో చేతికి వచ్చిన పూలను కోయడానికి వీలులేకుండా పోయింది. పంటపైనే పూలు రాలిపోవడంతో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో నష్టపోవలిసి వస్తోందని దిగులు చెందుతున్నారు.

5 వేల ఎకరాల్లో సాగు..

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కలిపి సుమారుగా 5వేల ఎకరాల్లో 1,000 మందికి పైగా రైతులు పూల సాగు చేశారు. వీరందరూ ఆందోళన చెందుతున్నారు. పూల విక్రయాలు జోరుగా సాగే ఈ సమయంలో కష్టాలు ఎదురయ్యాయని బాధ పడుతున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో భారీ ఎత్తున శుభకార్యాలు జరుపుకుంటారు. పెండ్లీలు, గృహప్రవేశం, నూతన వస్త్రాలంకరణ, చిన్న చిన్న ఫంక్షన్లు నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ ఫంక్షన్‌లకు ఫుల్‌స్టాప్ పడటంతో పూల రైతులకు, వ్యాపారులకు భారీ నష్టమే జరుగుతున్నది. ఈ నష్టం పూడ్చేదెట్ల అని రైతులు మథనపడుతున్నారు.

ఈ జిల్లాలో సాగుచేసే పూలను విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారు. కొన్ని పూలను హైదరాబాద్‌లోని గుడ్డిమల్కాపురం పూల మార్కెట్లో విక్రయిస్తారు. పెద్ద పెద్ద వాళ్లు చేసే ఫంక్షన్లలో కాస్ట్లీ పూలు విదేశాల్లోకి విమానంలో సరఫరా చేస్తారు. అమెరికా, చైనా, జపాన్, దుబాయికి కూడా పంపిస్తారని అధికారులు చెబుతున్నారు.కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

ప్రభుత్వం ఆదుకోవాలి..

ఈ జిల్లాలో గులాబీ, మల్లె, చామంతి, బంతి, కనకంబరాలు, లిల్లీ, ముద్దబంతి, సంపంగి, మరువం, సన్నజాజి, గార్బేరా లాంటి పూల సాగు చేస్తారు. కోతకు వచ్చిన ఈ పలు రకాల పూలను కోయలేక పొలంలోనే వదిలేస్తున్నారు రైతులు. కోట్ పల్లి, నవాబ్‌పేట్ మండలాల్లో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉన్నది. కోట్ల రూపాయలు నష్టం రావడంతో దిక్కు తోచని స్థితిలో పూల రైతులు ఉన్నారు. పూల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – నాగ్‌సాన్‌పల్లి సర్పంచ్, పద్మనాగార్జున రెడ్డి

Tags: lock down, Huge Loss, flower farmers, Transport stopped


Next Story

Most Viewed