కృష్ణా బేసిన్‌లో నిండుకుండల్లా జలాశయాలు

by  |
కృష్ణా బేసిన్‌లో నిండుకుండల్లా జలాశయాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటోంది. ప్రధానంగా కృష్ణా బేసిన్‌లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువగా నీరు నిల్వ ఉంది. గురువారం వరకు ఎగువ ప్రాజెక్టుల్లోకి వరద పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తున్న వానలతో వరదలు పెరుగుతున్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టుల్లోకి 49,636 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 10వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఆల్మట్టిలోని రెండు విద్యుత్ ఫ్లాంట్లను ప్రారంభించారు. పవర్ జనరేషన్ ద్వారా 8,958 క్యూసెక్కులను నదిలోకి వదులుతుండగా 930 క్యూసెక్కులను కెనాల్ ద్వారా వదలుతున్నారు. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ 82.53 టీఎంసీలకు చేరింది. గతేడాది ఇదే సమయానికి ఆల్మట్టిలో 46.45 టీఎంసీలు ఉండగా, ఈసారి 82 టీఎంసీల నిల్వ దాటింది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 10,105 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, నీటి నిల్వ 25.87 టీఎంసీలకు చేరింది. గతేడాది ఈ ప్రాజెక్టులో 19 టీఎంసీల నిల్వ ఉంది.

ఇక ఉజ్జయినీకి కూడా వరద కొనసాగుతోంది. 4,587క్యూసెక్కులు వస్తుండగా ప్రాజెక్టు నిల్వ 60టీఎంసీలకు వచ్చింది. గతేడాది ఈ సమయానికి 37 టీఎంసీలున్నాయి. ఇక జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు మొత్తం 9.66 టీఎంసీల సామర్థ్యం ఉండగా 8 టీఎంసీల నిల్వకు చేరింది. ఇంకా 2577 క్యూసెక్కులు వస్తున్నాయి. గతేడాది ఇదే సమయానికి జూరాలలో నీటినిల్వ 1.96 టీఎంసీలు మాత్రమే. కానీ ఈసారి నిండుగా తొణికిసలాడుతోంది. జూరాల నుంచి బీమా, నెట్టెంపాడు సమాంతర కాల్వల నుంచి 1400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక గోదావరి బేసిన్‌లో వరదలు కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీకి స్వల్పంగా వరద నమోదవుతోంది. ఎస్సారెస్పీలోకి 1,520 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 32టీఎంసీల నిల్వ ఉంది. ఎల్లంపల్లికి 721 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 492 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదవుతోంది. గోదావరి డెల్టా సిస్టంలో 51,070 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 52,691 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదైంది.


Next Story

Most Viewed