సాగర్ ఉపఎన్నికలో ఎన్ని ఓట్లు పోలయ్యాయంటే..?

by  |
Sagar by-election Polling
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉపఎన్నికలో 86.2 శాతం పోలింగ్ నమోదయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. ఈసారి స్వల్పంగా ఓటింగ్ శాతం పెరిగిందనే చెప్పాలి. సాగర్ ఉపఎన్నికలో మొత్తం 2,20,206 ఓట్లు ఉండగా, 1,89,857(86.2 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుష ఓటర్లు 95,413 మంది, మహిళా ఓటర్లు 94,444 మంది ఉన్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే..పోలింగ్ శాతం తగ్గింది. కానీ ఓట్ల విషయానికొస్తే.. స్వల్పంగా పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే.. అప్పుడు నియోజకవర్గంలో 2.08 లక్షల ఓట్లు ఉంటే.. ప్రస్తుతం 2.20 లక్షల ఓట్లు ఉన్నాయి. పోలైన ఓట్లలోనూ వ్యత్యాసం ఉంది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల కంటే పోలింగ్ శాతం తగ్గినా.. పోలైన ఓట్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఇలా..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 278 పోలింగ్ కేంద్రాల్లో 86.82 శాతం పోలింగ్ నమోదయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2.08 లక్షల ఓటర్లు ఉండగా, ఇందులో పురుష ఓటర్లు 103510 కాగా, మహిళా ఓటర్లు 104736 ఉన్నారు. ఇందులో 90,293 మంది పురుష ఓటర్లు, 89758 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో టీఆర్ఎస్ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు 83,743 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డికి 76,017 ఓట్లు వచ్చాయి. దీంతో నర్సింహయ్య 7726 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నోములకు వచ్చిన మెజార్టీ ఓట్లు పోలైన ఓట్లలో 4.31 శాతం కావడం గమనార్హం.

మండలాల వారీగా ఓటింగ్ శాతం ఇలా..

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2.20 లక్షల ఓట్లు ఉన్నాయి. అయితే గుర్రంపోడు మండలంలో 34,697 ఓట్లు ఉండగా 31,111 ఓట్లు(89.66 శాతం) పోలయ్యాయి. పెద్దవూర మండలంలో 44,783 ఓట్లు ఉంటే.. 34,729 ఓట్లు(77.55), తిరుమలగిరి(సాగర్)లో 31,510 ఓట్లు ఉంటే.. 27,647ఓట్లు (87.74 శాతం), అనుములలో 33,846 ఓట్లు ఉంటే.. 29,058 ఓట్లు(85.85 శాతం) పోలయ్యాయి, నిడమనూరులో 34,256 ఓట్లకు 30444 ఓట్లు(88.87 శాతం), మాడ్గులపల్లిలో 7,233ఓట్లకు 6,729 ఓట్లు(93.03 శాతం), త్రిపురారంలో 33,881 ఓట్లకు 30,064(88.73 శాతం) ఓట్లు పోలయ్యాయి.

Next Story

Most Viewed