21 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు!

by  |
21 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నాటికి ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 21 శాతం పెరిగాయని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ప్రాప్ఈక్విటీ నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, పూణె నగరాల్లో ఇళ్ల అమ్మకాలు సానుకూలంగానే నమోదయ్యాయని నివేదిక తెలిపింది. దేశంలో ఈ ప్రధాన ఏడు నగరాల్లో జనవరి-మార్చి మధ్య 21 శాతం వృద్ధితో మొత్తం 1,05,183 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరగా, గతేడాది ఇది 87,236 యూనిట్లుగా నమోదైంది. కొత్త ఇళ్ల సప్లై మాత్రం 40 శాతం క్షీణించి 59,737 యూనిట్లుగా నమోదైనట్టు సంస్థ తన నివేదికలో పేర్కొంది. అదే విధంగా కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇళ్ల డిమాండ్ మందగించే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది. హైదరాబాద్ సహా ఆరు ప్రధాన నగరాల్లో విక్రయాలు సానుకూలంగా నమోదవగా, కోల్‌కతాలో 20 శాతం అమ్మకాలు పడిపోయాయి.



Next Story