కొత్త నివేదిక తెలిపిన షాకింగ్ న్యూస్.. మనమంతా పీకల్లోతు అప్పుల్లో ఉన్నాం

by  |
కొత్త నివేదిక తెలిపిన షాకింగ్ న్యూస్.. మనమంతా పీకల్లోతు అప్పుల్లో ఉన్నాం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల కంటే దక్షిణాది రాష్ట్రాల వారి కుటుంబాల అప్పులు ఎక్కువగా ఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) తెలిపింది. దక్షిణాదిలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ కుటుంబాల రుణాలు అధికంగా ఉన్నాయని ‘భారత అప్పులు, పెట్టుబడులు- 2013-19’ పేరుతో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2019లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాల అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం 67.2 శాతంతో మొదటి స్థానంలో ఉందని, నాగాలాండ్ 6.6 శాతంతో ఈ జాబితాలో చివరన ఉందని నివేదిక తెలిపింది.

పట్టణ ప్రాంతాలకు సంబంధించి కుటుంబాల అప్పుల్లో కేరళ అధికంగా 47.8 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, మేఘాలయ 5.1 శాతంతో అట్టడుగున ఉంది. రాష్ట్రాల తలసరి ఆదాయం మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే ఎక్కువగా ఉంది. ఇక, దక్షిణాదిలోని ఐదింటిలో ఆంద్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణల్లో కుటుంబ ఆస్తుల విలువ అధికంగా ఉండగా, కర్నాటక రాష్ట్రం ఆస్తుల విలువలో దేశీయ సగటు కంటే అధికంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబాల అప్పులు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంది. గతేడాది కొవిడ్ ప్రభావం వల్ల ఈ అప్పులు ఎక్కువగా పెరిగాయని నివేదిక వెల్లడించింది.



Next Story

Most Viewed