యాజమాని కర్కశత్వం.. కరోనా సోకిందని ఇంట్లోంచి వెళ్లగొట్టాడు

by  |
యాజమాని కర్కశత్వం.. కరోనా సోకిందని ఇంట్లోంచి వెళ్లగొట్టాడు
X

దిశ, జగిత్యాల : కరోనా విపత్కర పరిస్థితుల్లో మానవత్వం కనుమరుగవుతోంది. ఈ మహమ్మారి నుంచి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓవైపు ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నా ఇంకా చాలా మంది కరోనా పేరుతో దాష్టికంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ పట్ల సరైన అవగాహన లేక కరోనా బాధితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తన ఇంట్లో అద్దెకుంటున్న కుటుంబానికి కరోనా సోకిందని ఓ ఇంటి యజమాని వారిని నిర్ధాక్షణ్యంగా వెళ్లగొట్టాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్‌లో బుధవారం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని గణేష్ నగర్‌లో ద్యానపెళ్లి రమేష్ చంద్రకళ దంపతులు కొడుకు అవినాష్ కలిసి కొన్నేండ్లుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే కుటుంబంలోని ముగ్గురికి కరోనా సోకింది. విషయం తెలిసిన ఇంటి యజమాని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాల్సింది పోయి మధ్యాహ్నం ముగ్గురిని ఇంట్లో నుండి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులకు ఏమి చేయాలో తోచక పక్కనే ఉన్న హనుమాన్ ఆలయ చెట్టు నీడలో తలదాచుకున్నారు. స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేసి విషయం తెలపగా వెంటనే స్పందించిన సిబ్బంది ఆ ముగ్గురిని జెన్టీయూ కళాశాల ఐసోలేషన్‌కు తరలించారు. కరోనా పట్ల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, స్వీయ జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉంటే కరోనా సోకదని వైద్యాధికారులు చెబుతున్నారు.

Next Story