ప్రచారంలో పంచ్‌ డైలాగ్‌లు ఓట్లు రాల్చేనా..!

by  |
ప్రచారంలో పంచ్‌ డైలాగ్‌లు ఓట్లు రాల్చేనా..!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: తెలంగాణలో మాటల వార్ నడుస్తున్నది. నేతల మాటలు లిమిట్స్ దాటుతున్నాయి. సభలు, సమావేశాల్లో తిట్లదండకం అందుకుంటున్నారు. ఒకరిని మించి మరొకరు ఫైర్ అవుతూ నోరు జారుతున్నారు. బీజేపీ రాష్ట్రంలో ఫాంలోకి వచ్చిన నాటి నుంచి టీఆర్ఎస్‌తో మాటల యుద్ధం సాగుతున్నది. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మొదలైన దూషణల పర్వం.. నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. నేడు ఎమ్మెల్సీ ప్రచారంలోనూ కొనసాగిస్తున్నది. కేవలం సభల్లోనే కాదు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు సైతం పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి. దీంతో జనమంతా ఎవరికి ఓటు వేయాలనేది కాకుండా ఏ నేత ఏం తిట్టాడు.. ఏం పంచ్ వేశాడు.. ఎలా ఫైర్ అయ్యాడు.. అంటూ వాటిపైనే చర్చ సాగిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా లిమిట్స్ క్రాస్ చేస్తూ.. నోరు పారేసుకుంటుండడంతో ఓటర్లు నవ్వుకుంటున్నారు. అయితే ఈ మాటల తూటాలు ఎంతవరకు ఓట్లు రాలుస్తాయో వేచి చూడాలి మరి.

గోడకు వేలాడే తుపాకి..

పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హాట్‌హాట్‌గా సాగుతున్నది. ఓ వైపు బీజేపీ.. మరోవైపు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మాటల తూటాలను పేల్చుకుంటున్నాయి. నేతల విమర్శలు.. ఎదురు దాడులతో తెలంగాణ పాలిటిక్స్‌ హీటెక్కాయాయి. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీలాంటిదంటూ బీజేపీకి మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ తుపాకి ఫామ్ హౌజ్‌లో తుప్పు పట్టిపోయిందని.. ఇప్పుడు పేలే పిరిస్థితి లేదంటూ మాటలతో పేల్చేశాడు.

గెలువలేని చోట పీవీ కుమార్తె..

గెలువలేని చోట పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ సీట్‌ ఇచ్చారంటూ బండి సంజయ్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. పీవీపైన అంతగా గౌరవం ఉంటే ఏ రాజ్యసభ కో.. లేదా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి పంపోచ్చు కాదా.. అని పీవీ కుటుంబాన్ని అవమాన పర్చేందుకే తన కుమార్తెకు ఓడిపోయే సీటు ఇచ్చారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీని ఎదుర్కొలేకే పీవీ ఫొటోలను పట్టుకుని టీఆర్ఎస్‌ ప్రచారం చేస్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

మిడిసి పడొద్దు..

దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ నేతలు మిడిసిపడుతున్నారంటూ మంత్రి కేటీఆర్‌ కామెంట్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా తామే అవతరించామమని, మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను సైతం మేమే కైవసం చేసుకున్నామంటూ చేసిన కామెంట్స్‌పై ఆ పార్టీ నేత లక్ష్మణ్‌ మండిపడ్డారు. తమ పార్టీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక అసహనంతో కేటీఆర్‌ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాబోయే నాగర్జున సాగర్ ఉప ఎన్నికలో సైతం దుబ్బాక ఫలితమే వస్తుందని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మనమే కేంద్రానికి ఇచ్చాం..

కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంజాయ్ చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్‌ ఆరోపణలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఆరేళ్లలో తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్‌లు, వివిధ రకాల పన్నుల రూపంలో 2,72, 926 కోట్ల రూపాయలు చెల్లించిందన్నారు. అయితే ఇందులో కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది కేవలం 1,40, 329 కోట్ల రూపాయలేనన్నారు. దీనిని బట్టి చూస్తే రూపాయి మనం ఇస్తే.. అర్ధ రూపాయి కేంద్రం ఇచ్చిందని ప్రశ్నించారు. దీని లెక్కన ఎవరుఎవరికి ఇచ్చారో బండి సంజయ్‌ చెప్పాలంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఐటీఐఆర్ గొడవ..

కాంగ్రెస్‌ హయంలో ఇచ్చిన ఐటీఐఆర్‌ను కూడా ఎన్డీఏ సర్కార్‌ రద్దు చేసిందని.. ఎందుకు రద్దు చేశారో కూడా చెప్పలేని పరిస్థితిలో కేంద్రం పెద్దలున్నారని కేటీఆర్ ఫైరయ్యారు. ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలకు ఐటీఐఆర్ తిగిరి తీసుకువచ్చే దమ్ముందా.. అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తుందంటూ దుయ్య బడుతున్నారు. ఏదేమైనా బీజేపీ అధికారంలోకి వచ్చాక జీడీపీ మాత్రం బాగా పెరిగిందంటూ కేటీఆర్‌ సెటైర్లు వేశారు. కేటీఆర్ అబద్దాల్లో తండ్రిని మించి పోయాడని బాప్ ఏక్ నంబర్.. కొడుకు దస్ నంబర్ అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. 13 వేల కంపెనీలు..1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే టీఆర్ఎస్ పల్లకీ మోస్తానని.. లేకుంటే బడితె పూజ తప్పదని బండి సంజయ్ సవాల్ విసిరారు.

ఢిల్లీలో దీక్షకు రేడీనా..

ఐటీఐఆర్, విభజన చట్టంలోని హామీలను సాధించుకునేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేద్దాం.. ఇందుకు మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉండాలి.. ఐటీఐఆర్ లాంటి పథకాలను మోడీ సర్కారు అటకెక్కించింది. అప్పుడు నోరు మెదపని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఓట్ల కోసం మాట్లాడడమేమిటీ. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మోడీ మెడలు వంచుతానన్న కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి తానే మెడలు వంచి జీ హుజూర్ అంటూ దిగిని ఫొటోలను ప్రజలు మర్చిపోవద్దని పీసీపీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.



Next Story

Most Viewed