త్వరలోనే భారత్‌లోకి మొదటి ఎలక్ట్రిక్ వాహనం : హోండా మోటార్‌సైకిల్

by  |
త్వరలోనే భారత్‌లోకి మొదటి ఎలక్ట్రిక్ వాహనం : హోండా మోటార్‌సైకిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా మొదటి ఈవీని విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది పండుగ సీజన్ చివరి నుంచి తమ డీలర్ భాగస్వాములతో కలిసి హోండా తన మొదటి ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) స్కూటర్‌ను తెచ్చే ప్రయత్నాలపై చర్చించనుంది. సంస్థ మాతృసంస్థ హోండా మోటార్ కంపెనీతో నిశితంగా చర్చించిన తర్వాతే దేశీయంగా ఈవీ విభాగంలోకి రావాలని నిర్ణయించామని హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అట్సుషి ఒగాటా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు.

అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈవీ ఉత్పత్తి ప్రారంభించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులకు ప్రభుత్వం సహకరిస్తున్న తరుణంలో విదేశీ తయారీదారులతో పాటు అనేక కంపెనీలు ఈవీ విభాగంలోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో తక్కువ దూరం ప్రయాణాలకు ఈవీలను వాడకం పెరిగిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశీయ మార్కెట్ల అత్యంత ఆదరణ కలిగిన తమ యాక్టివా, షైన్ టూ-వీలర్ మోడళ్లను ఎలక్ట్రిక్ విభాగంలోకి మార్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కేవలం ఈవీ ఉత్పత్తి మాత్రమే కాకుండా బ్యాటరీ నిర్వహణ వ్యవస్థలో ప్రవేశించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.



Next Story

Most Viewed