తెలంగాణ పోలీసింగ్ విధానం దేశంలోనే నెంబర్ వన్ : హోంమంత్రి మహమూద్ అలీ

by  |
తెలంగాణ పోలీసింగ్ విధానం దేశంలోనే నెంబర్ వన్ : హోంమంత్రి మహమూద్ అలీ
X

దిశ, షాద్ నగర్ : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందని, ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రంలో రూ.80 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవన సముదాయం, రైతువేదిక, ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదిని హోంమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితా రెడ్డిలతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందన్నారు.

ప్రజల సౌకర్యార్థం పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్ట పరచడంలో భాగంగా రూ. 7 వందల కోట్లను కేటాయించారని, 28 వేల పోలీస్ పోస్టులను భర్తీ చేశారని వివరించారు. ఎప్పుడు లేని విధంగా 33 శాతం మహిళా సిబ్బంది పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడు లక్షల సీసీ కెమెరాల ద్వారా నిత్యం శాంతి భద్రతల పర్యవేక్షణ జరుగుతోందన్నారు. సిద్దిపేటలో అత్యాధునిక కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నిర్మించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, సైబర్ నేరాలను అరికడుతున్నామన్నారు. రౌడీయిజాన్ని కంట్రోల్‌లో పెట్టి అవసరమైతే పీడీ యాక్టులు నమోదు చేశామన్నారు. శాంతి భద్రతలను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.

షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ భవనం, సిబ్బందికి క్వార్టర్స్ కూడా త్వరలో నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. జేపీ దర్గా వద్ద ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణ లక్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపీపీ వై రవీందర్ యాదవ్, స్థానిక జడ్పీటీసీ విశాల రెడ్డి, ఏసీపీ కుషాల్కర్, రూరల్ సీఐ సత్యనారాయణ, కేశంపేట ఎస్సై కోన వెంకటేశ్వర్లు, నాయకులు, ఎంపీపీ విశ్వనాథం, జగదీశ్వర గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed