ఇంటి వైద్యంతో జర జాగ్రత్త..!

by  |
ఇంటి వైద్యంతో జర జాగ్రత్త..!
X

మేడ్చల్ కు చెందిన శ్రీకాంత్ కు వారం క్రితం జ్వరం వచ్చింది. దీనికితోడు దగ్గు సైతం మొదలైంది. కొవిడ్ సోకిందన్న భావనతో ఆందోళనకు గురయ్యాడు. ఎవరికైనా చెబితే తనను ఎలా చూస్తారోననే భయం మొదలైంది. దీంతో సోషల్ మీడియాలో సూచించిన ప్రకారం వైరస్ నివారణకు వేసుకోవాల్సిన మందులను వాడాడు. మందుల ప్రభావంతో ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయి. తీరా వైద్యుడిని సంప్రదిస్తే అనవసరపు మాత్రలు వాడడంతో రియాక్షన్ అయిందని, ఇక మీదట ఇలాంటి ప్రయోగాలు చేయద్దని హెచ్చరించాడు.

దిశ ప్రతినిధి, మేడ్చల్ :కరోనా జనాన్ని అయోమయానికి గురి చేస్తోంది. వైరస్ నివారణకు మందు లేకపోవడం..రోజురోజుకూ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైరస్ విరుగుడుకు వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేకపోవడంతో మహమ్మారి తమకు సోకుండా రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలను అవలంభిస్తూ.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

సొంత వైద్యం చేటు..

కొవిడ్ నివారణ కోసం ప్రజలు సొంత వైద్యం, సోషల్ మీడియాలో సూచిస్తున్న చిట్కాలను పాటిస్తున్నారు. అయితే కరోనా సోకిన తర్వాత వాడాల్సిన మందులను కొందరు ముందుగానే వాడుతూ.. రోగాల పాలవుతున్నారు. ఏ మందు అయినా రోగం వచ్చిన తర్వాత.. అదీ అవసరమైన మేరకు మాత్రమే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్తగా మందులను వాడడం మంచిది కాదని, ఒకవేళ అనవసరంగా మందులను వాడితే కొన్నిసార్లు కార్డియాకరెస్టుకు దారి తీయవచ్చనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముందు జాగ్రత్తగా..

కరోనాకు ఇంత వరకూ వ్యాక్సిన్, మందులు రాలేదు. త్వరలోనే వ్యాక్సిన్ తీసుకొస్తామని పలు ఫార్మా కంపెనీలు ప్రకటనలు చేస్తున్నాయి. కానీ అవి మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంకా ప్రయోగాలే ఫలించలేదు. పూర్తిస్థాయి పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్ మీద సమర్థవంతంగా పనిచేస్తాయన్న ఉద్దేశంతో కొన్ని రకాల మందులు వాడుతున్నామని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ నివారణకు మొదట్లో మలేరియా వస్తే ఉపయోగించే హెడ్రో క్లోరో క్వీన్ ను వినియోగించారు. దీంతో చాలా మంది జ్వరం సోకగానే ఈ మందును వాడుతున్నారు. వైద్యులు, వైద్య రంగానికి చెందిన వారు సైతం ఈ జాబితాలో ఉన్నారు. నులిపురుగుల నివారణకు వాడే ఐరన్ మెఫ్తిన్, హెచ్ ఐవీకి వాడే లోపినవిర్ 50 ఎంజీ, రిటో 200 ఎంజీ మందులు ఇటీవల విరివిగా వాడుతున్నారు. జ్వరం వస్తే పారసిటమాల్ తో పాటు సిపిక్సిమ్, అమాక్సీ క్లావ్ లోనిక్ యాసిడ్ వంటి యాంటీబయాటిక్ లు, సిట్రజిన్ వంటి యాంటి ఎలర్జిక్ మందులను ప్రజలు విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు.

విటమిన్లకు భలే డిమాండ్..

కరోనా వచ్చాక బాధపడడం కంటే రాకుండా చూసుకోవడం మేలని చాలామంది భావిస్తున్నారు. ఇందుకు ఏఏ మార్గాలు ఉన్నాయో శోధిస్తున్నారు. రోగ నిరోధక శక్తి ఉంటే కరోనా వచ్చినా ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. దీంతో చాలా మంది రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి తంటాలు పడుతున్నారు. విటమిన్ సి, డితో పాటు బి కాంప్లెక్సు మాత్రలు వాడుతున్నారు. దీంతో ఫార్మసీల్లో విటమిన్ మాత్రలకు డిమాండ్ పెరిగింది. తమ సూచన లేకుండా అనవసరంగా మందులు వాడితే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. యాంటీ బయాటిక్ మందులను వైరస్ సోకినప్పుడే వాడాలని, లేదంటే ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి ఇతర సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అజిత్రోమైసిన్, హైడ్రాక్సీ క్లోరోక్వినైన్ వంటి మందులు గుండెపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

వైద్యులు సూచన మేరకే వాడాలి

వైద్యులు సూచన మేరకు మందులు వా డాలి. ఇప్పటి వరకు కరోనాను నివా రించే మందులు రాలేదు. కొన్ని మం దులు వేస్తే కరోనా తగ్గుతుందని బాధితులకు వాడుతున్నాం. యాంటి రిట్రోవైరల్ మందులు, హైడ్రాక్సి క్లోరోక్విన్ వంటి మందులు వైరస్ సోకకముందే వాడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. -డాక్టర్ అవంతి, ప్రభుత్వ వైద్యురాలు


Next Story

Most Viewed