చరిత్రలో లేని విధంగా రంజాన్‌.. నమాజ్, ఇఫ్తార్, తరావీ ఇళ్లలోనే..!

by  |
చరిత్రలో లేని విధంగా రంజాన్‌.. నమాజ్, ఇఫ్తార్, తరావీ ఇళ్లలోనే..!
X

నేటి నుంచి ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ ఆరంభమవుతుంది. నేడే నెలవంక దర్శన మివ్వనుండటంతో ప్రార్థనలతో ముస్లింల ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా ముస్లింలు రంజాన్ మాసాన్ని చాలా నిబద్దతతో ఆచరిస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు రోజా ఉండడమేంటి, ఐదు సార్లు నమాజులో పాలుపంచుకోవడమేంటి, సామూహికంగా ఇప్తార్ విందులో పాలుపంచుకోవడమేంటి…అన్నీ ఖురాన్‌లో ప్రవచించిన ప్రకారం చేస్తారు.

అయితే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రంజాన్‌ మాసం ఆరంభం కానుంది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన తబ్లిఘీ జమాత్ మర్కజ్ ప్రార్ధనలు దేశంలోని నాలుగు రాష్ట్రాలను అందులోనూ ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసేశాయి. ప్రధానంగా ముస్లిం వర్గాన్ని కరోనా బారిన పడేలా చేశాయి. దీంతో ఒకరకంగా సామూహిక ప్రార్ధనలపై అంతా ఆగ్రహంగా ఉన్నారు. ఈ దశలో రంజాన్ మాసం రావడంతో మసీదుల్లో ప్రవేశం, సామూహిక ప్రార్థనలు, ఇఫ్తార్లకు అడ్డుకట్ట పడింది.

ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ సామూహిక ప్రార్థనలతో మరింత వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది సామూహిక ప్రార్థనలు నిర్వహించకూడదని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు దేవబంద్‌ దారుల్‌ ఉలూమ్, హైదరాబాద్‌ ఇస్లామిక్‌ విశ్వవిద్యాలయం జామియా నిజామియా, ఇస్లామిక్‌ ఉలేమాలు, మౌలానా, ముఫ్తీలు, ఇస్లామిక్‌ స్కాలర్స్‌ ద్వారా ఫత్వాలు జారీ అయ్యాయి. లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రంజాన్‌ ప్రార్థనలు, ఇఫ్తార్, తరావీలు ఇళ్లలోనే పూర్తి చేసుకునేందుకు ముస్లింలకు ఆదేశాలు జారీ చేశారు.

ఇళ్లలో సైతం సామూహిక ప్రార్థనలు, విందులపై ఆంక్షలు విధించారు. హలీమ్, హరీస్‌ తయారీని ఈ ఏడాదికి నిలిపేస్తున్నట్టు వంటకాల యజమానులు స్వచ్ఛందంగా ప్రకటించారు. పలు వ్యాపారాలు సైతం ప్రభుత్వం అనుమతిచ్చిన వేళల్లో మాత్రమే నిర్వహించాలని దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తూనే, ఎవరింట్లో వాళ్లు రంజాన్ మాసాన్ని నిర్వహించేలా జాగ్రత్తలు చెబుతున్నారు. ఇక రంజాన్ మాసం నిర్వహించుకునే వివరాల్లోకి వెళ్తే..

ప్రతి మసీదులో ఐదు పూటలు అజాన్ వినిపిస్తుంటుంది. అలాగే నమాజ్‌లు, ఉపవాస దీక్ష సైరన్‌లు మోగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. మసీదులో ఇమామ్, మౌజన్, మసీదు కమిటీకి సంబంధించిన మరో ముగ్గురికి మాత్రమే ప్రార్థనలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మసీదులో సామూహిక ఇఫ్తార్‌ విందు, హరీస్‌ వంటకాలు చేయకూడదని స్పష్టం చేసింది. అలా చేస్తే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇళ్లలోనే ఐదుపూటలా నమాజ్, ఉపవాస దీక్ష సహర్, ఇఫ్తార్‌ విందులు, తరావీ ప్రార్థనలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ప్రార్థనల్లో కూడా అంతా ఒక చోటే కాకుండా సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. అజాన్‌ చివరిలో ముస్లింలు తమ ఇళ్లలోనే నమాజ్‌ చదవాలన్న అనౌన్స్‌మెంట్‌ వినిపించనుంది. ముస్లింలు తప్పకుండా చేసే జకాత్, ఫిత్రాలు పంచడానికి ఇంటివద్ద గుమిగూడకుండా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ పేదవారిని వారి ఇంటి వద్దకు చేర్చాలని సూచించింది. ఈ నిబంధనలన్నీ పాటిస్తూ రంజాన్ నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags: muslims, ramdan, ramzan, roja, namaz, jakat, fitrat


Next Story

Most Viewed