కేంద్ర బడ్జెట్: ఫారిన్ లిక్కర్‌ ధరలకు రెక్కలు

by  |
కేంద్ర బడ్జెట్: ఫారిన్ లిక్కర్‌ ధరలకు రెక్కలు
X

దిశ, క్రైమ్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్ నూతనంగా తీసుకొచ్చిన అగ్రికల్చరల్ సెస్‎తో పలు ఖరీదైన వస్తువులపై వేయనున్న సెస్ అదనపు భారం కానుంది. ఈ అగ్రి సెస్ కారణంగా క్రూడ్ ఆయిల్, ఆల్కహాల్ తదితర విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సెస్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముడి పామాయిల్, యాపిల్స్, ముడి సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ పై 17.5 శాతం నుంచి 35 శాతం సెస్ అదనంగా పడనుంది. పెట్రోల్, డీజీల్ పై విధించిన వ్యవసాయ సెస్‌ను మినహాయిస్తామని కేంద్రం ప్రకటించగా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్ పై 100 శాతం సెస్‌ను విధించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ద్వారా ప్రకటించారు.

దీంతో విదేశీ మద్యం ధరలు ఇక నుంచి రెట్టింపు కానున్నాయి. కొవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలపై 20 శాతం కొవిడ్ సెస్‌ను విధించిన సంగతి తెలిసిందే. కొవిడ్ పేరుతో అదనంగా విధించే సెస్‌ను లిక్కర్ దుకాణాల వద్ద కొనుగోలు చేస్తున్న సమయంలో వినియోగదారుడు చెల్లిస్తుండగా.. ప్రస్తుతం విదేశీ మద్యానికి కేంద్రం విధించే అగ్రి సెస్‌ను ఏ రూపంలో చెల్లించాల్సి ఉంటుందో స్పష్టత లభించడం లేదని వైన్స్ దుకాణాదారుల అసోసియేషన్ చెబుతోంది.

రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్ తదితర విదేశీ మద్యం బ్రాండ్లకు అదనంగా విధించే అగ్రిసెస్ దిగుమతి సమయంలో విధిస్తారా.. టీఎస్‌బీసీఎల్ వద్దకు వచ్చిన తర్వాత దుకాణాల వద్ద కొనుగోలు చేసే సమయంలో వినియోగదారుడి నుంచి అదనంగా వసూలు చేయాలనే విషయాలపై ఇంకా స్పష్టత రావాలని బార్లు, వైన్స్ యాజమానులు చెబుతున్నారు. ఈ సెస్‌ను ఏ రూపంలో వసూలు చేసినప్పటికీ, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే విదేశీ మద్యంపై 100 శాతం సెస్ మాత్రం తప్పనిసరి పడనుంది. దీంతో వినియోగదారులు తాము ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన విదేశీ మద్యం బ్రాండ్లను రెట్టింపు వ్యయంతో కొనుగోలు చేయాల్సి రావడం మాత్రం ఖాయం.

Next Story