భగ్గుమంటున్న ఉత్తర తెలంగాణ

by  |
భగ్గుమంటున్న ఉత్తర తెలంగాణ
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో రోహిణి కార్తె విశ్వరూపం కొనసాగుతోంది. రోళ్ళు పగులుతున్నాయో లేవోగానీ ప్రజలు మాత్రం ఎండ వేడికి మాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల తదితర జిల్లాలోల అత్యధిక స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరుసగా వారంరోజుల నుంచి నిర్మల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలు రోడ్లమీద తిరగొద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. హైదారబాద్ నగరంలో సైతం గతంలో ఎన్నడూ లేనంతగా సగటున 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో గరిష్టంగా నిర్మల్ జిల్లాలోని జన్నారం, సోన్ ప్రాంతాల్లో 45.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. దానికి అనుకుని ఉన్న జిల్లాలలోని లోకరి (ఆదిలాబాద్)లో 45.8 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో 45.8, ఆదిలాబాద్ జిల్లా బేలలో 45.7 డిగ్రీలు, సిరిసిల్ల జిల్లా మల్లారంలో 45.7, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 45.7, శ్రీరాంపూర్‌లో 45.6 డిగ్రీలో చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ నగరంలో సైతం అత్యధికంగా మాదాపూర్‌లో 42.6 డిగ్రీలు, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, పటాన్‌చెరు, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో 42.5 డిగ్రీల చొప్పున నమోదైంది. నగరంలో సగటున 42.3 డిగ్రీలు నమోదైనట్టు రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ పేర్కొంది. ఈ నెల చివరి వరకూ ఇదే తీరులో ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని తెలిపింది.

వాయవ్యం నుంచి వడగాలులు

రాష్ట్రంలో వాయువ్యం దిశ నుంచి వడగాలులు వీస్తున్నాయని, ఆ ప్రభావం వల్లనే ఉత్తర తెలంగాణ జిల్లాల మొదలు నల్లగొండ, సూర్యాపేట వరకు వేడి ఎక్కువగా ఉన్నదని, రానున్న నాలుగైదు రోజుల వరకు ఇదే తీరులో తీవ్రత ఉంటుందని రాష్ట్ర వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. సహజంగా బొగ్గు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని, కానీ ఈసారి వాయువ్యంలో ఉన్న రాజస్థాన్ నుంచి వీస్తున్న గాలుల వలన కేవలం తెలంగాణలో మాత్రమే కాక ఉత్తర భారతంలో కూడా ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిందని వివరించారు. ఈ ప్రభావంగానే ఈసారి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వరకు వేడి కొనసాగుతూ ఉందన్నారు. మూడు నాలుగు రోజుల పాటు వడగాలులు మరింత ఎక్కువగానే వీసే అవకాశాలు ఉన్నాయని, పగటి వేళల్లో రోడ్లమీద తిరగకుండా ఉండడమే ఉత్తమమని జాగ్రత్తలు సూచించారు.

Next Story