కరోనా వేళ సింగరేణికి భారీ లాభాలు

by  |
Singareni
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బొగ్గు, విద్యుత్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. మొదటి త్రైమాసికంలో బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.6,337 కోట్ల టర్నోవర్ సాధించగా.. మొత్తం 663.32 కోట్ల లాభాలను నమోదు చేసింది. మొత్తమ్మీద మొదటి త్రైమాసికంలో 78 శాతం వృద్ధిని సాధించింది.

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.5,393 కోట్ల బొగ్గు అమ్మకాలు జరిపి గత ఏడాది ఇదే కాలానికి సాధించిన అమ్మకాలపై 89.16 శాతం వృద్ధిని సాధించి౦ది. దీనితో సుమారు రూ.394.89 కోట్ల లాభాలను నమోదు చేసింది. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ బొగ్గు ఉత్పత్తి, రవాణాను గత ఏడాది కన్నా ఎక్కువ స్థాయిలో చేయడంతో ఇది సాధ్యమైంది.

గత ఏడాది మొదటి త్రైమాసికంలో సింగరేణి సంస్థ రూ.2,851 కోట్ల బొగ్గు అమ్మకాలు జరిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 15.57 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 16.7 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా జరపడంతో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. సీఎండీ ఎన్.శ్రీధర్ ఉద్యోగులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగించి ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కోరారు.

కరోనా పరిస్థితులను ఎదిరించి..

గత ఏడాది కరోనా వ్యాధి పెద్ద ఎత్తున విజృంభించడంతో సింగరేణి వినియోగదారులైన పరిశ్రమలు తమ ఉత్పత్తులను కుదించుకోవడంతో ఇది సింగరేణి ఉత్పత్తి, రవాణాపై ప్రభావం చూపింది. సీఎండీ ఎన్.శ్రీధర్ గత ఏడాది కాలంగా పెద్ద ఎత్తున చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలు, వైద్య సేవలు, కార్మికులందరికీ వ్యాక్సినేషన్ వంటివి చేపట్టడంతో వ్యాధి ప్రభావం క్రమంగా సన్నగిల్లి ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్మికులు కూడా ఆత్మస్థైర్యంతో ఉత్సాహంగా విధులకు హాజరవడం తో ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకుంది.

సీఎండీ ఎన్.శ్రీధర్ కరోనా నివారణ చర్యలతో పాటు ఉత్పత్తిపై ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అన్ని ఏరియాల జీఎంలను అప్రమత్తం చేస్తూ, అలాగే సంస్థ డైరెక్టర్లకు దిశా నిర్దేశం చేయడం వలన బొగ్గు ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. చైర్మన్ సూచనల మేరకు మార్కెటింగ్ శాఖ తీసుకున్న ప్రత్యేక చొరవతో బొగ్గు సరఫరాపై ప్రత్యేక ఒప్పందాలు చేసుకోవడం కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడింది.

విద్యుత్ అమ్మకాలలోనూ 32.83శాత౦ వృద్ధి

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జైపూర్‌లో నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం గత ఆర్థిక సంవత్సరం త్రైమాసికం కన్నా ఈ త్రైమాసికంలో 32.83 శాతం వృద్ధిని కనపరిచింది. గత ఏడాది ఈ ప్లాంట్ రూ.711 కోట్ల విద్యుత్ అమ్మకాలు జరపగా.. ఈ ఏడాది రూ.944 కోట్ల విద్యుత్ అమ్మకాలు జరిపింది. మొత్తమ్మీద చూస్తే విద్యుత్ అమ్మకాలతో కలిపి సింగరేణి సంస్థ ఈ త్రైమాసికంలో రూ.6,337 కోట్ల అమ్మకాల జరపడంతో పాటు సుమారు రూ.663.32 కోట్ల లాభాలను నమోదు చేసింది.

Next Story

Most Viewed