చంద్రబాబుకు ఊరట.. సీఐడీ విచారణపై హైకోర్టు స్టే

by  |
Chandrababu naidu
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, నారాయణలకు తాత్కాలికంగా ఊరట లభించింది. సీఐడీ అధికారుల విచారణపై హైకోర్టు స్టే విధించింది. అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారాయణలకు నోటీసులు జారీ చేసింది. సీఐడీ నోటీసులపై చంద్రబాబు, నారాయణలు సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.

అసైన్డ్ భూముల వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని హైకోర్టు సీఐడీని ఆదేశించింది. అయితే విచారణ తొలిదశలో ఉన్న నేపథ్యంలో చెప్పలేమని తెలిపింది. పూర్తి స్థాయి విచారణకు అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐడీ స్పష్టం చేసింది. దీంతో ఇరువాదనలు విన్న హైకోర్టు సీఐడీ విచారణపై స్టే విధించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలపాటు హైకోర్టు వాయిదా వేసింది. ఇకపోతే శుక్రవారం ఉదయం నుంచి హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు.

సీఆర్డీఏ చట్టం ద్వారా తీసుకువచ్చిన జీవో చెల్లదనటం సరికాదని, ఐపీసీలోని సెక్షన్‌ 166, 167 ఈ ఫిర్యాదుకు వర్తించవన్నారు. ఉన్నతాధికారుల లిఖితపూర్వక ఆదేశాలను ఉల్లంఘిస్తే ఈ సెక్షన్ల కింద కేసు పెట్టాలని, అలాంటి ఆదేశాలు ఇక్కడ లేవని ఉన్నత న్యాయస్థానానికి న్యాయవాది సిద్దార్థ లూథ్రావాదించారు. ఫిర్యాదులోని ఆరోపణలకు.. పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈ ఫిర్యాదులో కేసు నమోదు చేయటం కుదరదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరోవైపు మాజీమంత్రి నారాయణ తరపున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ విజ్ఞప్తి మేరకు జీఓను సవరించారని, జీవోకు సంబంధించిన చర్చలు, విడుదల చేసే ప్రక్రియలో గాని.. అప్పటి సీఎం, మంత్రి పాల్గొనలేదని దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు విన్నవించారు. జీవో విడుదలయ్యాక మాత్రమే ఆమోదానికి పంపారని, వ్యక్తిగతంగా వెళ్లి అసైన్డ్‌ రైతుల ల్యాండ్‌ తీసుకుని.. వారిని నష్టపరిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లు వర్తిస్తాయని దమ్మాలపాటి అన్నారు. ఒక జీవో ద్వారా లబ్దిదారులకు ప్రయోజనం కల్పించి.. భూములు తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల కోసం భూములు తీసుకొనే సమయంలో.. అప్పటి ప్రభుత్వం అన్నివర్గాలకు లబ్ది చేకూర్చిందని.. దాని ప్రకారమే భూములు సమీకరించారని న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇకపోతే ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ జాస్తి నాగభూషణం వాదనలు వినిపించారు. ఇరువాదనలు విన్న హైకోర్టు ప్రస్తుతానికి స్టే విధించింది. అనంతరం విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.



Next Story

Most Viewed