యుద్ధాలప్పుడే మీడియాకు ఆంక్షలు లేవు.. ఇప్పుడెందుకు ?

by  |
యుద్ధాలప్పుడే మీడియాకు ఆంక్షలు లేవు.. ఇప్పుడెందుకు ?
X

దిశ, న్యూస్‌బ్యూరో: యుద్ధాలు జరిగే ప్రాంతాల్లోనే మీడియా క్షేత్రస్థాయిలో కవరేజ్ చేస్తుంటే సచివాలయం కూల్చివేత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు విధించాల్సి వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. మీడియాను ఎందుకు అనుమతించడంలేదని ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. సచివాలయం నిషేధిత ప్రాంతమేమీ కాదు గదా అని వ్యాఖ్యానించింది. సచివాలయం కూల్చివేతపై ప్రజలకు వాస్తవాలను తెలియజేయడానికి మీడియా కవరేజ్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బుధవారం హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

కూల్చివేతల సందర్భంగా ఎలాంటి ప్రాణనష్టం జరగరాదన్న ఉద్దేశంతోనే పరిసర ప్రాంతాల్లో జనసంచారం లేకుండా ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, కూల్చివేత పనుల్లో ఉన్న కార్మికుల రక్షణ కోసం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండొద్దన్న ఉద్దేశంతోనే మీడియాను సైతం అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. జోక్యం చేసుకున్న పిటిషనర్ తరఫు న్యాయవాది, కూల్చివేత పనుల్లో గోప్యత కోసమే ఈ ఆంక్షలు విధించిందని, ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాకు ఉందని పేర్కొన్నారు.

కూల్చివేత పనులపై ప్రజలకు సమాచారం తెలియజేసేలా ప్రభుత్వమే వీడియో, ఫోటో తీసి పంపే ఏర్పాట్లు చేయవచ్చుగదా అని హైకోర్టు సూచించింది. ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత స్పష్టత ఇవ్వగలుతామని, ఇందుకు వారం రోజుల సమయాన్ని ఇవ్వాల్సిందిగా హైకోర్టును కోరారు. కానీ ఇందుకు నిరాకరించిన కోర్టు ఒక రోజు వ్యవధిలోనే స్పష్టత ఇవ్వాలని తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రజాస్వామ్యంలో మీడియాకు ఉన్న ప్రాధాన్యతకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది.



Next Story

Most Viewed