ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు

by  |
Pushpa Srivani
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణికి హైకోర్టులో చుక్కెదురైంది. కుల ధ్రువపత్రం వివాదంపై పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, శ్రీవాణిని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కులంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. పిటిషనర్ తరపు న్యాయవాది బి.శశిభూషణ్ రావు వాదనలు వినిపించారు. ‘ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదన్న ఫిర్యాదుపై అప్పీలు విచారణ గిరిజన శాఖ మంత్రి దృష్టికి వచ్చింది. అయితే పుష్ప శ్రీవాణినే ఆ శాఖకు మంత్రి. ఆమె కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారంలో అప్పీల్ పై ఆమె విచారణ చేయడం చట్ట విరుద్ధం. ఏపీ, ఎస్సీ,ఎస్టీ,బీసీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీల్ అథార్టీని ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రిని ఆదేశించాలని’ పిటిషనర్ తరపు న్యాయవాది శశిభూషణ్ రావు కోరారు. ఇరువాదనలు విన్న ధర్మాసనం డిప్యూటీ సీఎం పాములు పుష్పశ్రీవాణికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.


Next Story

Most Viewed