జోరు వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు

by  |
జోరు వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. రాకపోకలకు అంతరాయమేర్పడింది. పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. వాగులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కడప నగరంలోని ఆర్టీసీ గ్యారేజీ చెరువును తలపిస్తోంది. జిల్లాలోని కమలాపురం – ఖాజీపేట ప్రధాన రహదారిలో బ్రిడ్జిపై పాగేరు వంక పొంగి పొర్లుతోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దముడియం మండలంలో కుందూ ప్రవాహం పెరుగుతోంది.

లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దండోరా వేయించారు. నెమలిదిన్నె, బలపనగుడూరు, చిన్నముడియం, సిరిపాల దిన్నే, గర్శలూరు, ఉప్పలూరు పెద్దముడియం గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. పోరుమామిళ్ళ, కలసపాడు, కాశినాయన, బి.కోడూరు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. పోరుమామిళ్ళ మండలంలో నాగలకుంట్ల, బూరగమానుపల్లె చెరువులు పూర్తిగా నిండుకున్నాయి. గోపవరం మండలం మడకల వారిపల్లె చెరువుకు భారీగా వర్షపు నీరు చేరింది. ఐదేళ్ల తర్వాత చెరువుకు నీరు చేరడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంట నష్టంతో పాటు రాకపోకలకు అంతరాయమేర్పడింది. అత్యధికంగా బండి ఆత్మకూరు మండలం లో 180.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మహానంది – గాజులపల్లి మధ్య పాలేరు వాగు వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. నంద్యాల – భీమవరం మధ్య వక్కిలేరు వాగు రాకపోకలకు వీల్లేకుండా చేసింది. గడివేముల మండలం కోరటమద్ది వద్ద వాగు గ్రామాల సంబంధాలను తెంపేసింది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో కుండపోత వర్షం పడుతోంది. డోనేకల్ వాగు పొంగిపొర్లడంతో గుంతకల్లు-బళ్లారి మధ్య రాకపోకలు నిల్చిపోయాయి.

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అంబడిపూడి వద్ద తూర్పు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతికి ఇద్దరు విద్యార్థులు కొట్టుకుపోగా స్థానికులు ఒకరిని కాపాడారు. అంబడిపూడి గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థి శ్రావణ్ కుమార్ మృతి చెందాడు. కంభం మండలంలోని రావిపాడు వద్ద గండ్లకమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగులో ఒక ట్రాక్టర్ కొట్టుకుపోయింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో ఏడుగురు ఉన్నట్టు సమాచారం.

నాగులుప్పలపాడు మండలం చదలవాడ చెరువుకు గండి పడటంతో చీరాల – ఒంగోలు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాచర్ల మండలంలో గుండ్లకమ్మ నది ఉగ్రరూప దాల్చింది. సగిలేరు ఉప్పొంగడంతో గిద్దలూరు-ఆకవీడుకు రాకపోకలు బంద్ అయ్యాయి. బేస్తవారిపేట మండలంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పది గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి.

గుంటూరు జిల్లాలో రొంపిచర్ల మండలం మునమాక, తుంగపాడు వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నరసరావుపేట వైపు రాకపోకలు బంద్‌ అయ్యాయి. తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కొట్టేళ్ల వాగు పొంగడంతో అధికారులు రాకపోకలను నిలిపేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

భద్రాచలం వద్ద వరద నీటిమట్టం 5 లక్షల క్యూసెక్కుల వరకు ఉండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ కు మరింత వరద నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాల ప్రభావం పెద్దగా లేకపోయినా గోదావరి కాస్త పెరిగితే లంక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.


Next Story

Most Viewed