మావోయిస్టుల వారోత్సవాలు.. మన్యంలో హై అలర్ట్

by  |
మావోయిస్టుల వారోత్సవాలు.. మన్యంలో హై అలర్ట్
X

దిశ, భద్రాచలం : మావోయిస్టు పార్టీ 17వ వార్షికోత్సవాలకు సన్నద్ధమైంది. అంతకు ముందు పీపుల్స్‌వార్‌గా ఉన్న పార్టీ 21 సెప్టెంబర్ 2004న మావోయిస్టు పార్టీగా పేరు మార్చుకుంది. ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు వారం రోజులపాటు పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పలుచోట్ల కరపత్రాలు వెలిశాయి. అదే క్రమంలో ఈనెల 27న జరిగే భారత్ బంద్‌కి మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటించారు. ఆ మేరకు మీడియాకి లేఖలు విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కి సరిహద్దుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి ఏజెన్సీలోని చర్ల, దుమ్మగూడెం మండలాలతోపాటు ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో పోలీసులు అప్రమత్తమైనారు. కొత్తగూడెం ఓఎస్‌డీ తిరుపతి ఆదివారం దుమ్మగూడెం పోలీస్‌స్టేషన్‌ని సందర్శించారు. సీఐ, ఎస్‌ఐలతోపాటు భద్రతా సిబ్బందికి తగు సూచనలు చేశారు. మావోయిస్టుల కదలికలపై పోలీసు నిఘావర్గాలు ఆరా తీస్తున్నాయి.

చర్ల సీఐ బి. అశోక్, దుమ్మగూడెం సీఐ ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెంచారు. మావోయిస్టులకు కంచుకోటలాంటి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర దండకారణ్య గ్రామాలకు రాకపోకలు సాగించేవారిపై డేగకన్ను వేసి ఉంచారు. ఇదిలా ఉండగా హింసాత్మక చర్యల వలన ఆదివాసీలకు జరుగుతున్న నష్టాలను వివరిస్తూ మావోయిస్టులకు వ్యతిరేకంగా చర్ల, దుమ్మగూడెం మండలాల్లో ఆదివాసీ సంఘాల పేరుతో ఇటీవల కరపత్రాలు వెలిసిన విషయం విదితమే.


Next Story

Most Viewed