‘కశ్మీర్ పిచ్’‌పై క్రికెటర్ల వార్

by  |
‘కశ్మీర్ పిచ్’‌పై క్రికెటర్ల వార్
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా వేళ కూడా పాక్, భారత క్రికెటర్ల మధ్య మ్యాచ్ నడుస్తోంది. అది కూడా కశ్మీర్ పిచ్‌పైన. అయితే అది బ్యాట్, బాల్ తో కాదు. వారి మధ్య మాటల వార్ నడుస్తోంది.
భారత్, పాక్ మధ్య ఏన్నో ఏండ్లుగా కశ్మీర్ వివాదం నడుస్తూనే ఉంది. భారత్-పాక్ రాజకీయాల ప్రభావం మిగతా ఆటల కంటే క్రికెట్ మీదే ఎక్కువగా ఉంటుంది. కొన్నాళ్లుగా పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను కూడా భారత్ తెంచుకుంది. కేవలం ఐసీసీ ఈవెంట్లలో తప్ప భారత్, పాకిస్తాన్ జట్లు ముఖాముఖి తలపడటం లేదు. తాజాగా కరోనా సంక్షోభం కారణంగా క్రికెటర్లందరూ ఇంటి వద్దే ఉంటున్నారు. పలు విషయాలపై తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో అఫ్రీది కదిలించిన కశ్మీరీ సమస్య చినికి చినికి గాలివానలా మారింది. కశ్మీర్ అంశంపైనా, ప్రధాని మోడీపైనా పాక్ మాజీ క్రికెటర్ అఫ్రీది తీవ్రంగా విరుచుకుపడుతూ మాట్లాడిన వీడియో బయటకు రావడంతో దానిపై భారత క్రికెటర్లు గంభీర్, శిఖర్ ధావన్ ధీటైన జవాబిచ్చారు. ‘కరోనా మహమ్మారిపై ప్రపంచమంతా పోరాడుతుంటే మీరు మాత్రం ఇప్పుడు కూడా కశ్మీర్ పైనే పడి ఏడుస్తున్నారు. కశ్మీర్ ఎప్పటికీ మాదే.. అది మాతోనే ఉంటుంది. కావాలంటే 22 కోట్ల మందిని తీసుకొని రా.. మేం కూడా వస్తాం. మాలో ఒక్కొక్కరు లక్షల మందితో సమానం’ అంటూ ధావన్ ట్వీట్ చేశాడు. ధావన్ ఇచ్చిన సమాధానానికి క్రికెట్ అభిమానులే కాక.. కోట్లాది మంది భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అఫ్రీది మాటలకు ముందుగా గంభీర్, హర్భజన్‌సింగ్ స్పందించారు. ‘పాక్ ప్రజలను మోసం చేయడానికి అఫ్రీది, ఇమ్రాన్ ఖాన్, బజ్వా లాంటి జోకర్లు ఉంటారు. వాళ్లు కావాలనే ప్రధాని మోడీపై విషం చిమ్ముతారు. కానీ, మీకో విషయం తెలుసా.. మీరెప్పటికీ కశ్మీర్‌ని పొందలేదు. మీకు బంగ్లాదేశ్ గుర్తుందా..?’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. అసలు భారత క్రికెటర్లు, అభిమానులు అఫ్రీదిపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి అసలు కారణం అతను పీవోకేలో చేసిన వ్యాఖ్యలే. ‘ఇదొక అందమైన ప్రాంతం. ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రాంతాన్ని మరోసారి సందర్శించాలని కోరుకుంటున్నాను. కానీ, ప్రపంచం ప్రస్తుతం కరోనా వంటి భయంకరమైన వైరస్‌ బారిన పడింది. అయితే అసలైన పెద్ద వైరస్ మోడీ మనసులో ఉంది. కశ్మీర్‌లో ఏడు లక్షల మంది భారత సైనికులను మోహరించాడు. అది మన పాకిస్తాన్ సైన్యమంత బలగం. భారత్‌లో ఉన్న కశ్మీరీలు కూడా పాకిస్తాన్ ఆర్మీనే సపోర్ట్ చేస్తున్నారు’ అని అఫ్రీది వ్యాఖ్యానించాడు.



Next Story

Most Viewed