కార్చిచ్చుకు ఏఐ సొల్యూషన్.. చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్ గెలుచుకున్న రేష్మ!

by  |
Reshma Kosaraju
X

దిశ, ఫీచర్స్ : అడవుల్లో రగులుకునే కార్చిచ్చు వల్ల ఎన్నో గ్రామాలతో పాటు అనేక జీవజాతుల్ని నష్టపోవడం చూస్తూనే ఉన్నాం. దావానంలా వ్యాపించే మంటల్ని ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా ఊహించని నష్టం వాటిల్లుతోంది. ఆ మంటల నుంచి వెలువడే పొగ కారణంగా అడవి చుట్టుపక్కల 300 కిలోమీటర్ల పరిధిలోని గ్రామస్తులు కాలుష్యం బారిన పడుతున్నారు. కాగా తరచూ జరిగే ఇలాంటి ఘటనల వల్ల వాటిల్లుతున్న నష్టాన్ని చూసి ఆలోచనలోపడ్డ ఇండో అమెరికన్ రేష్మ కొసరాజు.. ‘ఫారెస్ట్ ఫైర్స్’ను ముందుగానే గుర్తించే ఏఐ పరికరాన్ని రూపొందించింది. తన ఆవిష్కరణకు గాను ఎన్విరాన్‌మెంటల్ అవార్డు కూడా దక్కించుకుంది.

అడవుల్లో మంటలు చెలరేగడం సహజమే. కానీ దానివల్ల కలిగే ఫలితాలు చాలా దుర్భరమైనవని రేష్మ గ్రహించింది. అందుకు పరిష్కారాన్ని కనుగొనేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మూడేళ్లుగా ఫారెస్ట్ ఫైర్స్‌పై పరిశోధనలు కొనసాగించి, చివరగా డీప్ లెర్నింగ్ మోడల్‌లో ఒక డివైజ్‌ను రూపొందించింది. ఈ పరికరాన్ని ఉపయోగించి నేలలోని తడి, గాలిలోని తేమ, వేగం తదితర అంశాలతో పాటు ఉష్ణోగ్రతా వివరాల ఆధారంగా అడవుల్లో మంటలు సంభవించే అవకాశాన్ని ముందుగానే గుర్తించవచ్చు. దీనివల్ల 90 శాతం కచ్చితత్వంతో మంటల వ్యాప్తిని అరికట్టవచ్చని రేష్మ తెలిపింది. 32 వేర్వేరు దేశాల పార్టిసిపెంట్స్ పాల్గొన్న ‘చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్‌(CCP)’ కాంపిటీషన్స్‌కు ఈ ఆలోచనలు పంపగా.. రేష్మ విజేతగా నిలిచింది. కాగా చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్ గెలుపొందడం గౌరవంగా భావిస్తున్నాని, తన ప్రాజెక్ట్ గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపే అవకాశముందని ఎంతోమంది మెచ్చుకున్నారని రేష్మ పేర్కొంది.

చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్‌ను(CCP) 2016లో ప్రారంభించారు. విజేతలకు డిప్లొమా సర్టిఫికెట్‌తో పాటు పతకం, వారి ప్రాజెక్ట్ అభివృద్ధిని కొనసాగించడానికి SEK 100,000 ప్రైజ్ మనీని అందజేస్తుంది. భూగ్రహాన్ని మరింత నివాసయోగ్యంగా మార్చేందుకు కృషి చేసిన 12 – 17 ఏళ్ల యువకులకు స్వీడిష్ కంపెనీ టెల్గే ఎనర్జీ ఈ అవార్డ్‌ను అందజేస్తోంది. యువ ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, సంరక్షకులు సహా మార్పు కోసం ప్రయత్నించే వారికి అందించే ఈ ప్రైజ్.. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ వాతావరణ అవార్డుల్లో ఒకటిగా పేరుగాంచింది.



Next Story

Most Viewed