ఐదు రోజుల పాటు వర్షాలు

by  |
ఐదు రోజుల పాటు వర్షాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: నైరుతి రుతుపవనాల ప్రభావంతో 5రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం, బుధవారం నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్‌, కుమ్రం భీం, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణశాఖ అధికారులు వెల్ల‌డించారు. తెలంగాణ‌తోపాటు తూర్పు, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావ‌ర‌ణ కేంద్రం వెల్లడించింది. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మధ్య ఉపరితల‌ ఆవర్తనం ఏర్పడిందని, ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో జూన్ 19న‌ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

హైదరాబాద్‌ నగరంలో మంగళవారం పలుచోట్ల వర్షం కురిసింది. పంజాగుట్ట, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్, మాదాపూర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై వర్షం నీళ్లు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌ జామై వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలింగింది. రాబోయే 24 గంటల్లో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాలో మంగళవారం రాత్రి వరకు వర్షం కురిసింది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా రామగుండలో 69. మి.మి. వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో 61, పెద్దపల్లి జిల్లాలో 59.8, కరీంనగర్ లో 59.5 మి.మి. చొప్పున వర్షం కురిసింది.



Next Story